నిర్మాతల భవిష్యత్తుకు 'కేజీఎఫ్ 2' శాటిలైట్ భరోసా
on May 20, 2020
థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? రారా? అసలు వస్తే ఎంతమంది వస్తారు? థియేటర్లలో సినిమాలు ఎప్పటి నుండి విడుదల అవుతాయి? వంటి ప్రశ్నలు పరిశ్రమ ప్రముఖులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న తరుణంలో ఒక సినిమా శాటిలైట్ రైట్స్ 120 కోట్ల రూపాయలకు వెళ్లాలంటే... నిర్మాతలకు భవిష్యత్తు మీద భరోసా కల్పించే అంశమే. అసలు వివరాల్లోకి వెళితే... కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'కేజీఎఫ్ 2'. దేశవ్యాప్తంగా విజయం సాధించిన 'కేజీఎఫ్'కి సీక్వెల్ ఇది. తొలి భాగం విజయం సాధించిన నేపథ్యంలో రెండో భాగంలో సంజయ్ దత్ ను ప్రతినాయకుడి పాత్రకు తీసుకున్నారు. మరో పాత్రకు రవీనాటాండన్ ను ఎంపిక చేశారు. తెలుగు నుండి రావు రమేష్ ను తీసుకువెళ్లారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ క్రేజ్ నెలకొంది. అందుకని, ఈ సినిమాకు ఒక ఛానల్ 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాటిలైట్ రైట్స్ తీసుకుందని గుసగుస.
డిజిటల్ రైట్స్ కోసం ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ 55 కోట్లు ఆఫర్ ఇచ్చిందట. బ్రాండ్ ఎండార్స్ మెంట్ మీద కూడా సినిమా గట్టిగా సొమ్ము చేసుకుంటుందని సమాచారం. థియేట్రికల్ రైట్స్ కాకుండా ఇతరత్రా హక్కుల మీద సుమారు రెండు వందల నుండి 250 కోట్ల రూపాయలు వస్తాయని ఆశిస్తున్నారు. మరి థియేటర్లలో సినిమా విడుదలైతే ఎంత వస్తాయో? నిజానికి ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అప్పుడు వచ్చే అవకాశమే లేదు. ఇంకా కొంత షూటింగ్ బాలన్స్ ఉండడంతో ఎప్పుడు వస్తుందనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే.