పూర్ణ కిడ్నాప్ ప్లాన్ను భగ్నం చేసిన పోలీసులు
on Jul 2, 2020
నటి పూర్ణను కిడ్నాప్ చేయాలనుకున్న ముఠా ప్రయత్నం వారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో విఫలమైంది. కొచ్చి (కేరళ) పోలీస్ కమిషనర్ విజయ్ సఖారే చెప్పిన దాని ప్రకారం, పూర్ణ (అసలు పేరు షామ్నా కాశిమ్)ను కిడ్నాప్ చేయడం ద్వారా ఆమె కుటుంబం నుంచి డబ్బులు గుంజాలని ప్రయత్నించిన 12 మంది ముఠా సభ్యుల్లో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సమయానికి పూర్ణ ఫిర్యాదు చేయడంతో తమ ప్లాన్ను అమలు చేయాలనుకున్న ఆ నిందితులను పోలీసులు అడ్డుకోగలిగారు.
ఈ విషయాన్ని పూర్ణ కూడా ధ్రువీకరించింది. తమ కుటుంబం బ్లాక్మెయిల్ స్కామ్కు టార్గెట్ అయ్యిందని ఆమె చెప్పింది. "ముందుగా నిందితులు ఒక పథకం ప్రకారం నాకు పెళ్లి సంబంధం తెచ్చామంటూ మా కుటుంబాన్ని సంప్రదించారు. అయితే మమ్మల్ని పూర్తిగా తప్పుదోవ పట్టించే నకిలీ పేర్లు, నకిలీ అడ్రస్లు, మోసపూరిత ఐడెంటిటీలతో వారు మోసం చేశారని తెలియడంతో మా కుటుంబం వారిపై ఫిర్యాదు చెయ్యాలని నిర్ణయించుకుంది. వాళ్లు బ్లాక్మెయిల్కు దిగడంతో, లీగల్ యాక్షన్ కోసం మేం పోలీసులను సంప్రదించాం. ఇప్పటికీ వాళ్ల ఉద్దేశమేమిటనేది మాకు తెలీదు" అని తన ఫేస్బుక్ పేజీలో పూర్ణ రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఏడుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉండగా, ఒకరు కొవిడ్-19 పాజిటివ్గా తేలడంతో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం పూర్ణ కుటుంబ సభ్యుల వివరాలను మలయాళ చిత్రసీమకు చెందిన కొంతమంది నుంచి ఈ ముఠా సేకరించింది. అయితే ఈ కుట్రలో సినిమా వ్యక్తులకు భాగస్వామ్యం ఉండవచ్చనే అనుమానాలను పోలీసులు తోసిపుచ్చారు.
వివిధ ఫిర్యాదుల కింద ఈ ముఠాపై పోలీసులు ఏడు కేసులను నమోదు చేశారు. ఈ ముఠా ఈ ఏడాది మొదట్లో ఇదే తరహాలో ఎనిమిది మంది మోడళ్ల నుంచి డబ్బు గుంజిందని రిపోర్టులు తెలియజేస్తున్నాయి.