శైలజకు గుడి రెడీ చేస్తున్న తమిళులు
on Oct 28, 2016
భారత్లో సినిమా మతమైతే తారలు దేవతలు. అంతగా అభిమాన తారల్ని ఆరాధిస్తారు ఫ్యాన్స్. ఆ అభిమానం అనేది పలువురికి పలు రకాలుగా ఉంటుంది. కొందరు తమ అభిమాన నటీనటుల కోసం రక్తదానం, సేవ చేస్తే మరి కొందరికి ఈ పిచ్చి పీక్ స్టేజ్కు వెళ్లిపోయి గుళ్లే కడుతున్నారు. అలాంటి పిచ్చి అభిమానం చూపించే వాళ్లలో దేశంలో ముందు నిలిచేది తమిళులే. అప్పట్లో ఖుష్బూను విపరీతంగా అభిమానించిన తమిళ తంబీలు ఏకంగా ఆమెకు గుడికట్టేశారు. ఆ తర్వాత బొద్దు గుమ్మలు నమిత, హన్సికకు కూడా అదే పనిచేశారు. తాజాగా ఓ యంగ్ భామకి కోలీవుడ్లో గుడి కట్టబోతున్నారట. ఆ బ్యూటీ ఎవరో కాదు నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్.
ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్తో పాటు తమిళంలోనూ ఏకకాలంలో అవకాశాలు చేజిక్కించుకుంటోంది. థొడరి అనే చిత్రంతో ఇటీవలే కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి ప్రస్తుతం రెమో, భైరవ, పాంబు సట్టై, తానా సెరండ కొట్టమ్ అనే చిత్రాలతో తెలుగులో కంటే బిజీగా ఉంది. తమిళంలో కీర్తి చేస్తున్న సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోండటంతో ఫ్యాన్స్ ఈమె పట్ల విపరీతమైన అభిమానాన్ని చూపిస్తున్నారు తంబీలు. ఇక కొత్తగా చెప్పేదేముంది కీర్తికి కూడా గుడి రెడీ చేసేశారు. అయితే కుష్భూ, నమిత, హన్సికలు అంతటి అభిమానాన్ని సంపాదించుకోవడానికి చాలా ఏళ్లు పట్టింది. కానీ కీర్తి సురేష్ మాత్రం అతి తక్కువ టైంలోనే తమిళుల మనసులు గెలుచుకుంది.