కార్తికేయ.. బస్తీ బాలరాజు!
on Dec 14, 2019
ఇటీవలే '90ఎంఎల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ హీరోగా 'చావు కబురు చల్లగా' అనే మూవీ రూపొందనున్నది. 'భలే భలే మాగాడివోయ్', 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై ఈ సినిమా రూపొందనున్నది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. అల్లు అరవింద్ సమర్పించే ఈ చిత్రంలో బస్తీ బాలరాజు అనే పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనున్నది.
డైరెక్టర్ కౌశిక్ చెప్పిన విభిన్న కథ నచ్చి, కార్తికేయతో దాన్ని తీసేందుకు నిర్ణయించుకున్నామని నిర్మాత బన్నీ వాసు చెప్పారు. ఈ చిత్రానికి సునీల్రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. 'ఆర్ఎక్స్ 100' సినిమాతో సెన్సేషనల్ హిట్ సాధించిన కార్తికేయకు తర్వాత వచ్చిన మూడు సినిమాలు - 'హిప్పీ', 'గుణ 369', '90ఎంఎల్' చేదు ఫలితాన్నే ఇచ్చాయి. విలన్గా చేసిన 'గ్యాంగ్ లీడర్' సైతం ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై చేయనున్న సినిమాపై అతను చాలా ఆశలే పెట్టుకున్నాడు.