మొన్న ప్రభాస్.. నిన్న మహేశ్.. నేడు కాజల్!
on Feb 5, 2020
కాజల్ అగర్వాల్ ఆనందంతో, గర్వంతో ఉప్పొంగిపోతోంది.. కారణం సింగపూర్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం కలిగిన తొలి దక్షిణాది నటి (ఫిమేల్ యాక్టర్) ఆమే కావడం. కాజల్ కంటే ముందు మేడమ్ టుస్సాడ్స్లో మైనపు విగ్రహాలు కలిగిన దక్షిణాది నటులు ప్రభాస్, మహేశ్ మాత్రమే. రెండు రోజుల క్రితం తన ఫ్యామిలీతో కలిసి సింగపూర్కు వెళ్లింది కాజల్. బుధవారం (ఫిబ్రవరి 5)న అక్కడి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని తన మైనపు విగ్రహాన్ని స్వయంగా ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఆమె ముఖం అమితానందంతో వెలిగిపోయింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వీరాభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చింది.
ఈ ఆవిష్కరణ వేడుకలో కాజల్ తల్లిదండ్రులతో పాటు ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ కూడా పాల్గొంది. ఒక వైపు అక్క విగ్రహం, మరోవైపు అక్కతో కెమెరాకు నిష ఇచ్చిన పోజు ఆన్లైన్లో వైరల్ అవుతోంది. విగ్రహావిష్కరణ సందర్భంగా కాజల్ తన 100 రోజుల బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలెంజ్ గురించి తెలియజేస్తూ, అది భౌతికంగా, మానసికంగా తన ఎదుగుదలకు సాయపడిందని చెప్పింది.
2019 డిసెంబర్లో మేడమ్ టుస్సాడ్స్లో తన మైనపు విగ్రహాన్ని పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియా ద్వారా కాజల్ వెల్లడించింది. ఇక సినిమాల విషయానికొస్తే, శంకర్ డైరెక్షన్లో కమల్ హాసన్ టైటిల్ రోల్ చేస్తోన్న 'ఇండియన్ 2'లో ఆమె నాయికగా నటిస్తోంది. అలాగే వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఆమె నటించిన వెబ్ సిరీస్ ఫిబ్రవరి 14న విడుదల కానున్నది.
Also Read