అఫీషియల్.. సుబ్రహ్మణ్య స్వామిగా ఎన్టీఆర్..!
on Jun 11, 2025
అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తలపెట్టిన మైథలాజికల్ ఫిల్మ్.. జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్ళిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను తాజాగా నిర్మాత నాగవంశీ పరోక్షంగా కన్ఫర్మ్ చేశాడు.
పుష్ప-2 తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాల్సి ఉంది. దేవతల సేనాధిపతి కార్తికేయుడు(సుబ్రహ్మణ్య స్వామి) కథతో ఇది తెరకెక్కనుందని వార్తలొచ్చాయి. కానీ, బన్నీ ఈ సినిమా కంటే ముందు అట్లీ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టాడు. దీంతో త్రివిక్రమ్.. ఈ మైథలాజికల్ ఫిల్మ్ ను ఎన్టీఆర్ తో చేయడానికి సిద్ధమయ్యాడని సమాచారం.
నిజానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మొదట ఎన్టీఆరే చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో భారీ మైథలాజికల్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నామని, అది గ్లోబల్ ప్రాజెక్ట్ అని చెప్పాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఏం కానీ.. ఈ పౌరాణిక కథ అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళింది. ఈ కథను బన్నీ ఎంతగానో ఇష్టపడినప్పటికీ.. ఎందుకనో అట్లీ ప్రాజెక్ట్ నే మొదట చేయడానికి ఆసక్తి చూపాడు. దీంతో ఈ కథ మళ్ళీ ఎన్టీఆర్ ను వెతుక్కుంటూ వచ్చింది.
ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ తాజాగా నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశాడు. "అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఒకరిగా నా మోస్ట్ ఫేవరెట్ అన్న నటించనున్నాడు" అంటూ కార్తికేయ స్వామి శ్లోకాన్ని పంచుకున్నాడు. అంతేకాదు, "గాడ్ ఆఫ్ వార్ వస్తున్నాడు" అని రాసుకొచ్చాడు.
నిర్మాత నాగవంశీ తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అని పలు సందర్భాల్లో చెప్పాడు. ఎన్టీఆర్ ను "తారక్ అన్న" అని పిలుస్తుంటాడు. తాజాగా నాగవంశీ చేసిన ట్వీట్ ని బట్టి చూస్తే.. త్రివిక్రమ్ మైథలాజికల్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడనే విషయం స్పష్టమవుతోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
