'దోస్తీ' వీడియో సాంగ్ వచ్చింది.. హీరోలు చివరలో ఇలా మురిపించారు!
on Aug 1, 2021
స్నేహితుల రోజు సందర్భంగా యస్.యస్. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ 'ఆర్ఆర్ఆర్' మూవీ నుంచి దోస్తీ సాంగ్ వచ్చింది. దీన్నొక ప్రమోషనల్ సాంగ్గా చిత్రీకరించారు. కీరవాణి స్వరకల్పనలో సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను హేమచంద్ర ఆలపించాడు. ఈ మ్యూజికల్ వీడియోలో తనే పాడుతూ కనిపించాడు హేమచంద్ర. కీరవాణితో పాటు ఈ సినిమాకు సంగీత దర్శకులుగా, గాయకులుగా పనిచేసిన అనిరుధ్, అమిత్ త్రివేది, విజయ్ యేసుదాస్, యాజిన్ నజీర్ కూడా ఈ వీడియోలో దర్శనమిచ్చారు. వీడియో చివరలో కథానాయకులు రామరాజు (రామ్చరణ్) భీమ్ (జూనియర్ ఎన్టీఆర్) ప్రత్యక్షమయ్యారు. కీరవాణి మినహా గాయకులు, సంగీత దర్శకులు, హీరోలు సూట్స్ ధరించి కనిపించడం గమనార్హం.
"పులికీ విలుకాడికీ.. తలకీ ఉరితాడుకీ.. కదిలే కార్చిచ్చుకీ కసిరే వడగళ్లకీ.. రవికీ మేఘానికీ దోస్తీ.." అంటూ మొదలైంది పాట. రెండు భిన్నమైన వాటిమధ్య దోస్తీ కుదిరిందని చెప్తూ, "అనుకోని గాలి దుమారం చెరిపింది ఇరువురి దూరం.. ఉంటార ఇకపై ఇలాగ వైరమే కూరిమై.. నడిచేది ఒకటే దారై వెతికేది మాత్రం వేరై.." అంటూ ఇద్దరు కథానాయకుల పాత్రల తీరుతెన్నులను చూచాయగా చెప్పారు. మొదట్లో ఇద్దరి మధ్య వైరం ఉంటుందనీ, తర్వాత అది స్నేహంగా మారుతుందనీ ఈ పాటలో తెలియజేశారు. ఉద్వేగభరితంగా, ఉత్తేజభరితంగా సాగిన ఈ పాటకు హేమచంద్ర గళం సరిగ్గా సరిపోయింది. సతీశ్ కృష్ణన్ కొరియోగ్రఫీ అందించిన ఈ వీడియో సాంగ్కు దినేశ్ కృష్ణన్ సినిమాటోగ్రాఫర్.
ఈ పాటను యూట్యూబ్లో విడుదల చేయడం ఆలస్యం ఫ్యాన్స్ దానిని సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. అయితే ఈ వీడియో సాంగ్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ చివరలో ఇలా వచ్చి అలా మాయమవడం మాత్రం వారి ఫ్యాన్స్ను కొంత డిజప్పాయింట్ చేసిందని చెప్పాలి.
రామ్చరణ్ జోడీగా ఆలియా భట్, తారక్ జంటగా ఒలీవియా మోరిస్ నటిస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీలో అజయ్ దేవ్గణ్, సముద్రకని, శ్రియ, రే స్టీవెన్సన్, అలీసన్ డూడీ కీలక పాత్రధారులు. అక్టోబర్ 13న విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్నారు.
Also Read