ఆఖరి శ్వాస దాకా సినిమాలు చేస్తూనే ఉంటా!
on May 28, 2022
అందాల తారగా జయప్రద తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రియుల హృదయాల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకున్నారు. ఒకవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే, మరోవైపు పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న పాత్రలు చేసి గొప్ప తారల్లో ఒకరిగా పేరు పొందారు. జయసుధ, జయప్రద, శ్రీదేవి త్రయం ఒక దశాబ్ద కాలం తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది.
జయప్రద తెలుగులోనే కాకుండా, హిందీలోనూ అగ్రశ్రేణి నటిగా రాణించారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి, పార్లమెంట్ సభ్యురాలిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమె సినిమా రంగాన్ని వదలకుండా పలు భాషల్లో సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో 'లవ్ ఎట్ 65'లో రాజేంద్రప్రసాద్ జోడీగా ఆమె నటించారు. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
కాగా తను సినిమాల్లో నటిస్తూనే ఉంటాననీ, ఆఖరి శ్వాస దాకా సినిమా రంగంలో ఉంటాననీ తెలుగువన్ చానల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. "నేను పాలిటిక్స్లో బిజీగా ఉన్నానని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నేను సినిమాలు చేస్తాను. నా ఆఖరి శ్వాస దాకా సినిమా రంగంలోనే ఉంటా. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. దానికి ఎన్టీఆరే స్ఫూర్తి. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా సినిమాలు చేశారు. ఇప్పుడు నేను బీజేపీలో ఉన్నప్పటికీ ఏ పదవీ లేదు కాబట్టి నేను సినిమాలు చేయడానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. నేను చేసిన 'లవ్ ఎట్ 65' రిలీజ్ కాబోతోంది. హిందీలో 'ఫాతిమా', ఓ పంజాబీ మూవీ రిలీజవుతున్నాయి. ఇదివరకు నేను ఏడు భాషల్లో నటించాను. ఇప్పుడు పంజాబీ నేను నటించిన ఎనిమిదో భాష. తెలుగులో గ్యాప్ వచ్చినా, ఇతర భాషల్లో చేస్తున్నా." అని ఆమె చెప్పుకొచ్చారు.
Also Read