ప్రముఖ దర్శకుడు 'బాపు' ఇకలేరు
on Aug 31, 2014
ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు 'బాపు' ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నయ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. బాపు పూర్తి పేరు సత్తిరాజు లక్ష్మినారాయణ. 1933 డిసెంబర్ 15న వేణుగోపాల రావు, సూర్యకాంతమ్మలకు జన్మించారు. తొలి చిత్రం 'సాక్షి' కాగా చివరి చిత్రం 'శ్రీరామ రాజ్యం'. బాపు తన సుదీర్ఘ చలన చిత్ర జీవితంలో 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయిదు సార్లు నంది అవార్డులు, రెండు సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 1986 సంవత్సరంలో ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2013లో పద్మశ్రీ అవార్డు లభించింది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాపు కన్నుమూశారన్న వార్త తెలిసిన సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. తెలుగు సినిమా రంగంలో కావ్యాల్లాంటి సినిమాలు రూపొందించిన బాపు మరణం పట్ల పలువురు సినిమా ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.