దేవదాస్ కనకాల కన్నుమూత
on Aug 2, 2019
సీనియర్ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం (ఆగస్ట్ 2) సాయంత్రం మృతి చెందారు. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఆయన కుమారుడే. కుమార్తె శ్రీలక్ష్మి టీవీ నటి. ఇక కోడలు సుమ టీవీ యాంకర్గా ఎంత పేరు సంపాదించారో తెలిసిందే. గత ఏడాదే దేవదాస్ సతీమణి లక్ష్మీదేవి కన్నుమూశారు. చిరంజీవి, రజనీకాంత్, రాజేంద్రప్రసాద్ వంటి నటులకు నటనలో తర్ఫీదునిచ్చిన గురువుగా దేవదాస్ ప్రసిద్ధులు. కథానాయకుడు, పసుపుతాడు, న్యాయం కోసం, చెట్టుకింద ప్లీడర్, మగాడు, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, క్రిమినల్, అంగరక్షకుడు, మల్లీశ్వరి తదితర పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు దేవదాస్. ఆయన డైరెక్ట్ చేసిన 'చలి చీమలు' (1978) ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుపొందింది. ఈ సినిమాతోటే పరుచూరి బ్రదర్స్లో అగ్రజుడైన వెంకటేశ్వరరావు సంభాషణల రచయితగా పరిచయమయ్యారు. 'నిజం', 'నాగమల్లి', 'ఓ ఇంటి బాగోతం', 'పుణ్యభూమి కళ్లు తెరిచింది' సినిమాల దర్శకుడు ఆయనే. సందర్భవ శాత్తు రాజీవ్ కనకాల కీలకపాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల అభినందనలు పొందిన ’రాక్షసుడు‘ సినిమా విడుదలై ఘనవిజయం సాధించిన రోజే ఆయన మృతి చెందడం టాలీవుడ్ వర్గాల వారిని విషాదంలో ముంచెత్తింది.