దేశవ్యాప్తంగా తెరుచుకుంటున్న థియేటర్లు.. తెలుగు రాష్ట్రాల్లో స్పష్టత లేదు!
on Oct 15, 2020
కరోనా మహమ్మారి నీడలో దేశవ్యాప్తంగా ఏడు నెలలుగా మూసుకొని ఉన్న సినిమా హాళ్లలో చాలావరకు గురువారం తెరుచుకుంటున్నాయి. సుశాంత్సింగ్ రాజ్పుత్ నటించగా చివరిసారిగా థియేటర్లలో విడుదలైన 'చిచ్చోరే' సినిమా మళ్లీ విడుదలవుతోంది. మహారాష్ట్ర, కేరళ, చత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో థియేటర్లు, మల్టీప్లెక్సులు మూతపడే ఉండగా, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో కేంద్రం విధించిన కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా వాటిని తెరుస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో థియేటర్లు పునఃప్రారంభించడంపై ఇంకా స్పష్టత రాలేదు.
సినిమాలు చూసే విషయంలో కొత్త శకానికి నాంది పలికిన కేంద్ర ప్రభుత్వం మల్టీప్లెక్సులు, సినిమా హాళ్లు, థియేటర్లను గురువారం నుంచి తిరిగి తెరవడానికి అనుమతించింది. ఈ విషయంతో తుది నిర్ణయం తీసుకొనే అధికారం రాష్ట్రాలకు వదిలివేసింది.
దేశంలో అతిపెద్ద ఫిల్మ్ ఎగ్జిబిటర్ అయిన పీవీఆర్ సినిమాస్కు 71 నగరాల్లో 845 స్క్రీన్లు ఉన్నాయి. 10 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్క్రీన్లను తెరవడానికి అనుమతి లభించిందని ఆ సంస్థ తెలిపింది. గురువారం 487 స్క్రీన్లను స్టార్ట్ చేస్తున్నట్లు, త్వరలో మిగతా ప్రాంతాల్లోనూ స్క్రీన్లను తెరవడానికి ఆయా రాష్ట్రాల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఆశిస్తున్నట్లు పీవీఆర్ సినిమాస్ వెల్లడించింది.
కేంద్ర కొవిడ్ నిబంధనల ప్రకారం 50 శాతం కెపాసిటీతో థియేటర్లను నడుపుకోవచ్చు. ప్రేక్షకులు అన్ని వేళలా మాస్క్ ధరించే ఉండాలి. ఎయిర్ కండిషనింగ్ థియేటర్లలో టెంపరేచర్ 23 డిగ్రీల సెల్సియస్ తక్కువ కాకుండా చూడాలి.
బెంగళూరులో 'అల వైకుంఠపురములో', 'భీష్మ' లాంటి తెలుగు సినిమాలను గురువారం నుంచి ప్రదర్శించేందుకు ఎగ్జిబిటర్లు రెడీ అయ్యారు. చెన్నైలో 'సరిలేరు నీకెవ్వరు' తమిళ డబ్బింగ్ సినిమాను ప్రదర్శించనున్నారు.
Also Read