బాలయ్య మాటలకు హర్టయిన చిరు.. 'ఆచార్య' షూటింగ్ వాయిదా!
on Jun 5, 2020
టాలీవుడ్లో షూటింగ్లను పునఃప్రారంభించడానికి మెగాస్టార్ చిరంజీవి చర్చలను ప్రారంభించారు. మొదట తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్, కొంతమంది టాలీవుడ్ ప్రముఖులతో తన ఇంట్లో చర్చించిన ఆయన, ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా కలిశారు. ఆయన నుంచి సానుకూల స్పందన పొందారు. అయితే ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ కామెంట్లతో పరిస్థితి మారిపోయింది. చర్చలకు తననెవరూ పిలవలేదని చెప్పిన బాలయ్య.. భూముల పందేరం కోసమే కొంతమంది తలసానితో సమావేశాలు జరిపారని ఆరోపించారు.
బాలయ్య మాటలకు మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నోటిని అదుపులో పెట్టుకోవాల్సిందిగా బాలకృష్ణకు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ బాలకృష్ణ కామెంట్లు చిరంజీవిని మనస్తాపానికి గురిచేశాయని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. షూటింగ్లను తిరిగి ప్రారంభించడానికి జరుపుతున్న మీటింగ్లకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు ఆ వర్గాలు అంటున్నాయి. కాగా కొరటాల శివ దర్శకత్వంలో తను టైటిల్ రోల్ పోషిస్తోన్న 'ఆచార్య' మూవీ షూటింగ్ను కూడా చిరంజీవి వాయిదా వేసుకున్నట్లు ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. సినిమా షూటింగ్లకు సంబంధించి ఇప్పటివరకూ అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు కానీ, జీవోలు కానీ తీసుకురాలేదు. ఇది కూడా చిరంజీవిని ప్రభావితం చేసిందని తెలుస్తోంది.
నిజానికి జూన్ 15 నుంచి 'ఆచార్య' షూటింగ్ నిర్వహించాలని చిరంజీవి అనుకున్నారు. ఇప్పుడు ఆ షూటింగ్ షెడ్యూల్ను ఆగస్ట్కు వాయిదా వేశారంటున్నారు. అతి త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానున్నది.