టీఎన్ఆర్ కుటుంబానికి 'చిరు' సాయం.. లక్ష రూపాయలు!
on May 11, 2021
నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి తక్షణ ఖర్చుల నిమిత్తం మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయల సాయం అందజేశారు. చిరంజీవి అంటే అభిమానంతో సినిమా రంగానికి వచ్చిన టీఎన్ఆర్ తనదైన మార్గాన్ని ఎంచుకుని ఎదిగారు. టీఎన్ఆర్ మరణవార్త తెలిసిన చిరంజీవి తన దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం టీఎన్ఆర్ భార్యా పిల్లలకు ఫోన్ చేసి పరామర్శించారు. దాంతోపాటు తక్షణ ఖర్చుల కోసం లక్ష రూపాయల సాయం అందజేశారు.
టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు తాను చూశానని, ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం తనను ఎంతో ఆకట్టుకునేదని గుర్తుచేశారు. జీవితంలో పట్టుదలతో ఎదిగిన టీఎన్ఆర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కుటుంబానికి ఎలాంటి అవసరమొచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
మీరంటే వీరాభిమానం: చిరుతో టీఎన్ఆర్ భార్య
‘మీరంటే వీరాభిమానం సార్. తన 200వ ఇంటర్వ్యూ మీతోనే చేయాలని అనుకునేవారు. ఇంతవరకు మిమ్మల్ని కలవలేదు. మీరు మాకిలా ఫోన్ చేయడం ఎంతో సంతోషం కలిగించింది’ అన్నారు టీఎన్ఆర్ సతీమణి. టీఎన్ఆర్ మృతి వార్త తెలిసి చిరంజీవి మంగళవారం ఆమెకు ఫోన్ చేసి పరామర్శించగానే ఆమె అన్న మాటలివి. తమ కుటుంబానికి లక్ష రూపాయల సాయం అందజేసినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
