మన దేశం కోసం చేస్తున్న ‘చిరు’ సాయం ఇది!
on Oct 2, 2023
ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్నిసార్లు మానవ జీవనం అస్తవ్యస్తంగా మారుతూ ఉంటుంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో సినిమా తారలు తమ వంతు సాయం అందించడం మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా తన వల్ల కొన్ని ప్రాణాలైనా కాపాడాలి, తన వల్ల కొంతమందికైనా చూపు వస్తే అదే తనకు సంతృప్తినిస్తుందని నమ్మిన హీరో మన మెగాస్టార్ చిరంజీవి. లాక్డౌన్ సమయంలో కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు. ఇప్పటికీ సహాయం కోసం ఎదురుచూసే వారికి తన వంతు సాయం అందిస్తున్నారు మెగాస్టార్.
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ ట్రస్ట్ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ట్రస్ట్ ద్వారా బ్లడ్, ఐ బ్యాంకులను నిర్వహిస్తున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ... ‘ఈ ట్రస్ట్ ప్రారంభించిన నాటి క్షణాలను గుర్తు చేసుకుంటున్నాను. సమాజ సేవలో ఇదొక అద్భుతమైన జర్నీ. ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్ల బ్లడ్ను ట్రస్ట్ ద్వారా సేకరించడం జరిగింది. ఆ బ్లడ్ను అత్యవసరం వున్న వారికి అందించాము. అలాగే ఐ బ్యాంక్ ద్వారా 10 వేల మందికి కంటి చూపు వచ్చేలా చేశాము. ఈ ట్రస్ట్ సేవా కార్యక్రమాల కోసం తమ వంతు సాయం అందిస్తున్న అక్కా చెల్లెళ్ళకు, అభిమానులకు శాల్యూట్ చేస్తున్నాను. మన దేశం కోసం మనం చేస్తున్న చిరు సాయమిది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల కలిగే సంతృప్తిని నేను మాటల్లో చెప్పలేను’ అన్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
