హత్య కేసులో బాలయ్య నిర్మాతకు యావజ్జీవం
on May 25, 2017
ఓ హత్య కేసులో ప్రముఖ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావుకు న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. అసలు వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మ పేటలో బీచ్ మినరల్ కంపెనీ ఏర్పాటుపై చర్చించడానికి 2007 అక్టోబర్ 18న గ్రామస్తులతో కంపెనీ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. అక్కడ ఈ కంపెనీ పెట్టడంపై చాలా మంది ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ భేటీకి నాటి పాయకరావుపేట ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు హాజరై ప్రజల పక్షాన నిలిచారు. అయితే బంగారమ్మ పేటకు చెందిన గోసల కొండతో పాటు అతని బంధువులు కంపెనీ ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ప్రజలు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గోసల కొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు ప్రొత్సాహంతోనే తన తండ్రిని చంపారని ఆరోపిస్తూ అతని కుమారుడు గోవింద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎమ్మెల్యే సహా మరికొందరిని నిందితులుగా చేర్చారు. సుధీర్ఘ విచారణ అనంతరం అనకాపల్లి పదో జిల్లా అదనపు న్యాయమూర్తి వీరిని దోషులుగా నిర్దారిస్తూ తుది తీర్పును వెలువరించారు. చెంగల వెంకట్రావుతో పాటు మరో 20 మందికి జీవితఖైదు విధించారు. మరోవైపు చెంగలకు సినీ పరిశ్రమతో మంచి అనుబంధం ఉంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సమరసింహారెడ్డి చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవర్గాల్లో చెంగల పేరు మారు మోగిపోయింది. ఆ తర్వాత జూనియన్ ఎన్టీఆర్తో నరసింహుడు అనే చిత్రాన్ని కూడా తీశారు.