'ఈవీవీ సినిమా' బ్యానర్ మీద సినిమాలొస్తాయా?
on Dec 21, 2020
జంధ్యాల తర్వాత కామెడీ చిత్రాల రూపకల్పనలో అంతటి పేరు పొందిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. జంధ్యాల ఒకట్రెండు సీరియస్ సినిమాలు తీసినా, ప్రధానంగా కామెడీ సినిమాలతోనే లెజెండరీగా పేరు తెచ్చుకున్నారు. ఈవీవీ కేవలం కామెడీలనే కాకుండా ఆమె లాంటి సీరియస్ సినిమాలు, హలో బ్రదర్ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లు తీయడంలోనూ సిద్ధహస్తునిగా పేరు తెచ్చుకున్నారు. 2000 సంవత్సరంలో 'చాలా బాగుంది' సినిమాతో ఈవీవీ సినిమా అనే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి, తొలి చిత్రంతోనే మంచి విజయం సాధించారు. ఆ తర్వాత కూడా హిట్ సినిమాలు తీశారు. అలాంటి చక్కని దర్శకుడు అర్ధంతరంగా కేన్సర్ బారినపడి 54 ఏళ్ల వయసుకే 2011లో మృతి చెందారు.
ఆ సమయానికి పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేశ్ కంటే చిన్న కుమారుడు అల్లరి నరేశ్ టాలీవుడ్లో కామెడీ హీరోగా తనదైన మార్కెట్ను తెచ్చుకున్నాడు. రాజేంద్రప్రసాద్ తర్వాత ఓ మంచి కామెడీ హీరో ప్రేక్షకులకు లభించాడని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో తండ్రి నెలకొల్పిన ఈవీవీ సినిమా బ్యానర్ను కంటిన్యూ చేసి, ప్రతి ఏటా క్రమం తప్పకుండా సినిమాలు తియ్యాలని అన్నదమ్ములు రాజేశ్, నరేశ్ సంకల్పించారు. అలా తండ్రి పోయిన తర్వాత ఈవీవీ సినిమా బ్యానర్పై ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో నరేశ్ హీరోగా 2014లో 'బందిపోటు' సినిమా తీశారు.
ఆ సందర్భంలో ‘‘ఈవీవీ బేనర్ మీద నాన్నగారు ఎన్నో హిట్ చిత్రాలు తీశారు. మళ్లీ 'బందిపోటు' చిత్రంతో మా బేనర్పై సినిమాలు తీయడం ఆరంభించాం. ఇకనుంచి ఏడాదికి రెండు లేక మూడు చిత్రాలు నిర్మించాలనుకుంటున్నాం." అని చెప్పాడు. కానీ ఆ మాటల్ని ఆచరణలోకి తీసుకు రాలేకపోయారు. 'బందిపోటు' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవడంతో, ఆరేళ్లయినా ఇంతదాకా ఆ బ్యానర్ మీద మరో సినిమాని వారు తలపెట్టలేదు. పైగా, నరేశ్ కెరీర్ మునుపటిలా ఆశాజనకంగా లేదు. కెరీర్లో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈవీవీ సినిమా బ్యానర్ మీద మళ్లీ సినిమా వచ్చే అవకాశాలున్నాయా? అని ఈవీవీ ఫ్యాన్స్ సందేహిస్తున్నారు. ఈవీవీ తనయులు ఏం చేస్తారో కాలమే తెలియజేస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
