‘బొబ్బిలిసింహం’తెర వెనుక ఏం జరిగింది?
on Jul 13, 2017
ఒకరితో చేయాలనుకున్న సినిమాల మరొకరితో చేయడం, టైటిల్స్ మారిపోవడం, లేదా అనుకున్న టైటిల్ ని ముందు అనుకున్న కథకు కాకుండా వేరే కథకు పెట్టేయడం... ఇలాంటి మార్పలన్నీ సినిమా రంగంలో మామూలే. అలాంటి ఓ ఆసక్తికరమైన సందర్భం మీకోసం...
అది 1992 నాటి మాట. బాలకృష్ణ ‘రౌడీ ఇన్ స్సెక్టర్’సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా వంద రోజుల వేడుకను నిర్మాత టి.త్రివిక్రమరావు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా.. తాను తర్వాత బాలయ్య తో నిర్మించబోతున్న సినిమా టైటిల్ ని వేలాది అభిమానుల సాక్షిగా ప్రకటించారు త్రివిక్రమరావు. ఆ టైటిలే ‘బొబ్బిలి సింహం’. కథానాయికగా విజయశాంతి పేరునూ... దర్శకునిగా బి.గోపాల్ పేరు కూడా స్టేజ్ మీదే ఎనౌన్స్ చేసేశారు త్రివిక్రమరావు. ఇక చెప్పేదేముంది. అభిమానులు ఒకటే కేరింతలు. ఎప్పుడెప్పుడు ‘బొబ్బిలి సింహం’షూటింగ్ మొదలవుతుందా..! అని ఆశగా ఎదురు చూశారంతా.
‘రౌడీ ఇన్ స్పెక్టర్’తర్వాత బాలయ్య.... అశ్వమేథం, నిప్పురవ్వ, బంగారు బుల్లొడు, భైరవద్వీపం, గాండీవం ఇలా వరుసగా అయిదు సినిమాలు చేశారు. ఆ తర్వాత కానీ ‘బొబ్బిలి సింహం’సినిమా రాలేదు. పైగా హీరోయిన్ విజయశాంతి కాదు. ఆమె స్థానంలో రోజా, మీనా వచ్చి చేరారు. దర్శకుడిగా కూడా బి.గోపాల్ ని తప్పించి ఎ.కోదండరామిరెడ్డిని తీసుకున్నారు నిర్మాత టి. త్రివిక్రమరావు. ఈ మార్పుపై అప్పట్లో రకరకాల కథనాలు ఫిలిం వర్గాల్లో వినిపించాయి. నిజం ‘బొబ్బిలి సింహం’చిత్ర యూనిట్ కే తెలుసు. ఏది ఏమైనా... 1994 సెప్టెంబర్ 24న విడుదలైన ‘బొబ్బిలి సింహం’బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇక మరో సినిమా విశేషంతో మరో సారి కలుద్దాం.