'బిగ్ బాస్ 3' గ్రాండ్ ఫినాలే రివ్యూ
on Nov 4, 2019
'బిగ్ బాస్ 3 తెలుగు' విజేతగా సింగర్, మ్యూజిక్ కంపోజర్ రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ అందుకున్నాడు. ఐదుగురు కంటెస్టెంట్ల మధ్య జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ నవంబర్ 3న స్టార్ మా చానల్లో ప్రసారమైంది. అంచనాలకు తగ్గట్లుగానే అత్యంత రసవత్తరంగా, కన్నుల పండుగగా ఈ గ్రాండ్ ఫినాలే జరిగిందంటే కారణం.. అక్కినేని నాగార్జున హోస్టింగ్ అనేది నిజం. ముందు నుంచీ వినిపించిన విధంగా ఈ ఫైనల్కు చిరంజీవి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. అలీ రెజా, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్ ఒకరి తర్వాత ఒకరు ఎలిమినేట్ అవగా, చివరలో శ్రీముఖి, రాహుల్ పోటీలో మిగిలారు. పోటీ నుంచి డ్రాప్ అయితే ఇద్దరికీ చెరొక 25 లక్షలు ఇస్తానని హోస్ట్ నాగార్జున వాళ్లకు ఆఫర్ చేశారు. హౌస్లో ఇప్పటిదాకా పోటీ పడింది, చివరిదాకా నిలవడానికేనంటూ వాళ్లు ఆ ఆఫర్ను తిరస్కరించారు. ఆ తర్వాత ఆ ఇద్దర్నీ హౌస్ నుంచి నాగ్ బయటకు తీసుకువచ్చారు. మనదేశంలో 'బిగ్ బాస్' షో 13 ఏళ్ల క్రితం ప్రారంభమైందనీ, కానీ పాతికేళ్ల క్రితమే 'బిగ్ బాస్'గా మనకు దర్శనమిచ్చిన చిరంజీవి వస్తున్నారంటూ నాగ్ ప్రకటించగానే, స్టేజిపైకి మెగాస్టార్ గ్రాండియర్గా అప్పీరెన్స్ ఇచ్చారు. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్లు అందర్నీ ఆయనకు నాగ్ పరిచయం చేయబోగా, నాగ్ను ఆగమని చెప్పిన చిరంజీవి, ఒక్కో కంటెస్టెంట్ను పేరుపెట్టి పలకరించి, హౌస్లో వాళ్లు చేసిన పనుల్ని ప్రస్తావించడం ఆశ్చర్యపరిచింది, ఆకట్టుకుంది.
వితికా శేరు తమ పశ్చిమ గోదావరి అమ్మాయనీ, వరుణ్ సందేశ్ తమ జిల్లా అల్లుడనీ చెప్పి ఆయన అలరించారు. కంటెస్టెంట్, టీవీ తార రోహిణి "ఐ లవ్ యు సార్" అని చెప్పగానే, గుండె ఝల్లుమందన్నట్లు తన గుండెపై చేయిపెట్టుకొని "ఒక అమ్మాయి నాకు ఇలాంటి మాట చెప్పి చాలా ఏళ్లయింది" అన్నారు చిరంజీవి. బాబా భాస్కర్ "మీకు నేను పెద్ద ఫ్యాన్ని సార్" అంటే, "నేను కూడా మీ డాన్సుకి బిగ్ ఫ్యాన్ని" అని ఆయన్ని మెగాస్టార్ ఆనందపరిచారు. అలీ రెజా గ్లామర్ చూస్తుంటే తనకు జెలసీ ఫీలింగ్ కలుగుతోందని చెప్పగానే అక్కడున్నవాళ్లంతా గోల గోల చేశారు. తమన్నా సింహాద్రిని నిజాన్ని నిర్భయంగా చెప్పే మనిషిగా ప్రశంసించారు. మహేశ్ విట్టాను ఫైర్ బ్రాండ్గా అభివర్ణించారు. తన అబ్జర్వేషన్లో హానెస్ట్, సిన్సియర్ పర్సన్గా మహేశ్ కనిపించాడన్నారు. ఎవరెవర్నో నీ ప్రశ్నలతో ఏడిపించి ఉంటావు, వాళ్లందరి శాపంతోనే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చుంటావని అనుకున్నానని జర్నలిస్ట్ జాఫర్ను ఉద్దేశించి చిరంజీవి చెప్పగానే నవ్వులు విరిశాయి.
చివరికి అందరూ వేయికళ్లతో ఎదురుచూసిన ఘట్టం వచ్చేసింది. శ్రీముఖి, రాహుల్ ఇద్దరిలో ఎవరు ట్రోఫీని గెలిచినా, తాను మాత్రం ఇద్దర్నీ విజేతలుగానే భావిస్తానని చిరు చెప్పారు. తమలో ఎవరు విన్నర్ అయినా సంతోషమేనన్నారు ఫైనలిస్టులు. ఈ సందర్భంగా చిరంజీవి సినిమా 'హిట్లర్'లోని 'నడక కలిసిన నవరాత్రి.. సిగ్గుపడితే శివరాత్రి..' పాట పల్లవి పాడి అలరించాడు రాహుల్. అందరూ ఉత్కంఠతో చూస్తుండగా.. రాహుల్, శ్రీముఖి భావోద్వేగానికి గురవుతుండగా.. వాళ్లిద్దరి మధ్య నిల్చొని, ఇద్దరి చేతుల్నీ తన చేతుల్తో పట్టుకొని, రాహుల్ సిప్లిగంజ్ విజేత అయినట్లు అతని చేతిని పైకి లేపాడు నాగార్జున. రాహుల్ను విన్నర్గా, శ్రీముఖిని రన్నర్గా ఆయన ప్రకటించాడు. అందరూ చప్పట్లతో, ఈలలతో రాహుల్ని అభినందించారు. ఈ సందర్భంగా రాహుల్ కన్నీళ్లపర్యంతమయ్యాడు. బిగ్ బాస్ 3 విజేతగా తనను నిలిపినవాళ్లందరికీ పాదాభివందనం అన్నాడు ధూల్పేట కుర్రాడు రాహుల్. అద్దె ఇంట్లో ఉంటున్న తన కుటుంబానికి ఇల్లు కొంటానని చెప్పాడు. హౌస్లో తనతో పునర్ణవి ప్రవర్తించిన తీరును ప్రస్తావించాడు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం వల్లనో తన అమ్మానాన్నల కడుపున పుట్టానని ఉద్వేగానికి గురయ్యాడు.
చివరలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ 'బిగ్ బాస్' హౌస్లో గడపడమనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్రాష్ కోర్సుగా తాను భావిస్తున్నానన్నారు. డల్గా ఉండొద్దనీ, ట్రోఫీని రాహుల్ గెలుచుకున్నా, కోట్లాదిమంది ప్రేమను నువ్వు గెలుచుకున్నావంటూ శ్రీముఖితో చెప్పారు. ఇప్పుడు ఏ పాట పెట్టినా మీతో సమానంగా ఎనర్జిటిగ్గా డాన్స్ చేస్తానని శ్రీముఖి రిప్లై ఇచ్చింది. దాంతో "అమ్మడూ.. లెట్స్ డు కుమ్ముడూ" అని ఉత్సాహపరిచారు చిరంజీవి. రాహుల్కు 'బిగ్ బాస్ 3' విన్నర్ ట్రోఫీతో పాటు, 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు చిరంజీవి. 105 రోజుల పాటు సాగిన 'బిగ్ బాస్ 3' సీజన్ రోజురోజుకూ ఆసక్తిని పెంచుతూ, ఉత్కంఠ రేపుతూ, చివరికి అంచనాల్ని అందుకుంటూ క్రేజ్తో ముగిసింది.
Also Read