మాస్ జాతరే అంటున్న మెగాస్టార్!
on Jan 25, 2023
మెగాస్టార్ చిరంజీవిలో ఉన్నత స్థాయి నటుడు ఉన్నాడు. తొలినాళ్లలోనే 'పున్నమినాగు' అనే చిత్రంతో తన నటనా సత్తా ఏమిటో చూపించారు. ఇక 'మంచు పల్లకి'తో పాటు మరెన్నో చిత్రాలలో తనదైన నటనను పండించారు. కానీ ఈయన కెరియర్ 'ఖైదీ' నుంచి మలుపు తీసుకొంది. ఈ చిత్రం నుండి ఆయన నుంచి మాస్ యాక్షన్ ఇమేజ్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులు ఎక్కువైపోయారు. అయినప్పటికీ ఆయన తన కెరీర్లో ఆరాధన, రుద్రవీణ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు వంటి పలు చిత్రాలు చేశారు. ఇవి ఆయనలోని అసలుసిసలైన నటుడిని వెలికితెచ్చాయి.
కంటెంట్ పరంగా ఇవన్నీ అద్భుత చిత్రాలే గాని ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ లుగా, డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా 'సైరా నరసింహారెడ్డి'ని ఆయన తీశారు. ఈ సినిమా మొత్తం సీరియస్ మూడ్లో సాగడం వల్ల ప్రేక్షకులు మెచ్చిన ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రంలో లభించలేదు. దాంతో ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మరోవైపు మలయాళం 'లూసిఫర్'ని 'గాడ్ఫాదర్' పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రం బాగుందని అందరూ మెచ్చుకున్నప్పటికీ క్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది.
చిరంజీవి అంటే మాస్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, పవర్ఫుల్ ఎలివేషన్స్, మాస్ అంశాలన్నీ పుష్కలంగా ఉండే కథలే గుర్తుకు వస్తాయి. ఇదిలా ఉంటే 'వాల్తేరు వీరయ్య' సినిమాతో మెగాస్టార్ చిరంజీవి పవర్ ప్యాక్డ్ మాస్ మసాలా బ్లాక్బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఆయన అభిమానులతో ముచ్చటిస్తూ, "కామన్ ఆడియన్స్ అందరూ నా నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారో నాకు పూర్తిగా అర్థమైంది. 'సైరా నరసింహారెడ్డి', 'గాడ్ఫాదర్' లాంటి సినిమాలు ప్రేక్షకులు నా నుంచి కోరుకోవడం లేదు. అందుకే ఇకపై అలాంటి చిత్రాలు చేయను. 'వాల్తేరు వీరయ్య' లాంటి ఫుల్ ఎనర్జీ అండ్ మాస్ ఎంటర్టైనర్లు మాత్రమే చేస్తాను. అలాంటి వాటినే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వారు నన్ను అలా చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇక పై నానుంచి ఇలాంటి చిత్రాలు మాత్రమే వస్తాయి" అని ప్రామిస్ చేశారు.
'బోళా శంకర్'లో కూడా 'వాల్తేరు వీరయ్య'కు మించి మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటానని చెప్పారు. కథలలో మాస్ జాతర ఉండేలా డిజైన్ చేసుకుంటానని ఆయన తన అభిమానులకు మాటిచ్చారు. సో.. మెగాస్టార్ మరోసారి పాతకాలం నాటి రోజులకు వెళ్ళిపోతున్నారని అర్థమవుతోంది.