భారీ స్థాయిలో 'ఆది' రీరిలీజ్.. 'చెన్నకేశవ రెడ్డి'ని మించి!
on Sep 25, 2022
టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. 'పోకిరి', 'జల్సా' సినిమాలు భారీ స్థాయిలో మళ్లీ విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో పలు సినిమాలు అదే బాటలో పయనిస్తున్నాయి. తాజాగా 'చెన్నకేశవ రెడ్డి' చిత్రాన్ని రీరిలీజ్ చేయగా.. అద్భుతమైన స్పందన లభించింది. అలాగే 'ఆది' చిత్రాన్ని అంతకుమించి భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
'చెన్నకేశవ రెడ్డి' రీరిలీజ్ సందర్భంగా చిత్ర దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత బెల్లంకొండ సురేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'ఆది' రీరిలీజ్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీనికి నిర్మాత సురేష్ స్పందిస్తూ 'ఆది' రీరిలీజ్ కూడా ఉంటుందని చెప్పాడు. 'చెన్నకేశవ రెడ్డి'కి టైమ్ తక్కువ ఉండటంతో భారీగా స్పెషల్ షోలను వేయలేకపోయామని, 'ఆది' సినిమాని పక్కా ప్లానింగ్ తో ఓ రేంజ్ లో రిలీజ్ చేస్తామని తెలిపాడు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమాతోనే వినాయక్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. 'అమ్మతోడు అడ్డంగా నరికేస్తా' అంటూ 19 ఏళ్ళ వయసులో తారక్ సంచలనం సృష్టించాడు. ఈ సినిమాతోనే తారక్ మాస్ లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుని స్టార్ గా మారాడు. ఆయన ఫ్యాన్స్ లో ఈ సినిమాకి ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది. అలాంటిది ఈ సినిమాని రీరిలీజ్ చేస్తే ఫ్యాన్స్ హంగామా ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Also Read