పవన్ ఇండస్ట్రీ హిట్ `అత్తారింటికి దారేది`కి 8 ఏళ్ళు!
on Sep 27, 2021
కుటుంబ బంధాలకు పెద్దపీట వేసే దర్శకుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. `జల్సా` (2008) వంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో త్రివిక్రమ్ రూపొందించిన చిత్రం `అత్తారింటికి దారేది` (2013). అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే ఆన్ లైన్ లో లీకైనప్పటికీ.. బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించడమే కాదు, పవన్ కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్ గా నమోదైంది.
తాతయ్య రఘునందన్ (బొమన్ ఇరాని) కోరిక మేరకు.. పాతికేళ్ళ కిత్రమే తమ కుటుంబంతో బంధాలను తెంచుకున్న మేనత్త సునంద (నదియా)ని గౌతమ్ నంద (పవన్ కళ్యాణ్) ఎలా మనసు మార్చి తాతయ్యకి చేరువ చేశాడు? అన్నదే `అత్తారింటికి దారేది` చిత్ర కథాంశం. సింపుల్ పాయింట్ తో తెరకెక్కినా.. స్క్రీన్ ప్లే పరంగా మ్యాజిక్ చేసి కుటుంబ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ చిత్రం.. అప్పట్లో పలు రికార్డులను భూస్థాపితం చేసింది. అలాగే నాలుగు `నంది`, నాలుగు `ఫిల్మ్ ఫేర్` పురస్కారాలను సొంతం చేసుకుంది. అదేవిధంగా తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్ అయింది.
పవన్ కి జంటగా సమంత నటించిన ఈ సినిమాలో ప్రణీత, రావు రమేశ్, బ్రహ్మానందం, అలీ, కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణ, ముకేశ్ రిషి, బ్రహ్మాజీ, హేమ, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించగా.. ముంతాజ్, హంసా నందిని ప్రత్యేక గీతంలో తళుక్కున మెరిశారు.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన గీతాలన్ని విశేషాదరణ పొందాయి. ``ఆరడుగుల బుల్లెట్టు``, ``నిన్ను చూడగానే``, ``బాపుగారి బొమ్మ``, ``దేవ దేవమ్``, ``కిర్రాకు``, ``ఇట్స్ టైమ్ టు పార్టీ``, ``కాటమ రాయుడా``.. ఇలా ఇందులోని ప్రతీ పాట ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన `అత్తారింటికి దారేది`.. 2013 సెప్టెంబర్ 27న విడుదలై అఖండ విజయం సాధించింది. నేటితో ఈ మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామా 8 వసంతాలను పూర్తిచేసుకుంది.
Also Read