ENGLISH | TELUGU  

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు!

on Jun 1, 2023

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు పట్ల తెలుగు సినీ పరిశ్రమ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఏపీ ఫైబర్ నెట్ లో కొత్త సినిమాలు పదర్శించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం విశాఖపట్నంలో దీనికి శ్రీకారం చుట్టనున్నారు. నిర్మాతలు అంగీకారంతో థియేటర్లలో విడుదలైన సినిమాలు అదే రోజున ఫైబర్ నెట్ లోకి అందుబాటులోకి రానున్నాయి. కొత్త సినిమా చూడాలంటే రూ.99 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కసారి డబ్బు చెల్లిస్తే 24 గంటల్లోపు సినిమా ఎప్పుడైనా చూసుకోవచ్చు. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సినీ పరిశ్రమకు నష్టం కలిగించేలా ఉందని, దీనికి నిర్మాతలు ఎవరూ మద్దతు తెలపరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

ఏపీ ఫైబర్ నెట్ లో  కొత్త సినిమాలు పదర్శించబోవడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని నట్టి కుమార్ స్పష్టం చేశారు. "దేశంలో ఎక్కడా లేనివిధంగా సినిమా విడుదల రోజున ఏపీ ఫైబర్ నెట్ లో  కొత్త సినిమాలు చూసే అవకాశం కల్పించబోతున్నామని ప్రభుత్వం అంటోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఒక నిర్మాతగా, ఎగ్జిబిటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా,  తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను వ్యతిరేకిస్తున్నాను. తెలుగు సినీ పరిశ్రమను, నిర్మాతల మండలిని, ఫిలిం ఛాంబర్ ను సంప్రదించకుండా, జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయకుండా ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారు. 2013 లోనే ఎయిర్ టెల్ డీటీహెచ్ ద్వారా విడుదల రోజునే సినిమాలను ప్రదర్శించాలని అనుకున్నారు. కానీ అది సక్సెస్ కాలేదు. తమ సినిమాలు ఇచ్చే నిర్మాతలు ముందుకు రానప్పుడు ఇది ఎలా సక్సెస్ అవుతుంది. వాస్తవానికి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థను సర్వనాశనం చేసేవిధంగా ఈ విధానం ఉంటుంది. అందుకే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్  మాత్రమే కాకుండా అత్యధికభాగం నిర్మాతలు దీనికి వ్యతిరేకం. అయినప్పటికీ, ఏపీ చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణ మురళి గారు సినీరంగానికి చెందిన వ్యక్తి అయి ఉండి కూడా సినీ పరిశ్రమ వారితో మీటింగ్ ఏర్పాటు చేసి, అందరి అభిప్రాయాలు తీసుకోకుండా దీనిని ఆచరణలోకి తీసుకుని రావడం ఎంతమాత్రం సహేతుకం కాదు. ఇప్పటికే ఎగ్జిబిషన్ వ్యవస్థ దెబ్బతినిపోయింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఫైబర్ నెట్ లో సినిమాల నిర్ణయం వల్ల ఎగ్జిబిషన్ వ్యవస్థ మరింతగా కోలుకోలేనివిధంగా తయారవుతుంది. శుక్రవారం వైజాగ్ లో ప్రారంభం కాబోయే ఫైబర్ నెట్ సినిమాల ఆవిష్కరణ సభకు సంబంధించి నిర్మాతలను కానీ, సినీ పరిశ్రమకు చెందిన ఇతరులకు తెలియకుండా, పిలుపు లేకుండానే జరపబోతున్నారు. పరిశ్రమ వారిని కలుపుకుని పోకుండా, వారికి ఆహ్వానం లేకుండా వారికి వారే ఈ ప్రారంభాన్ని జరపబోవడం విడ్డూరంగా ఉంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై పునరాలోచించి ఎవరికీ ఇబ్బందిలేని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను" అని అన్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.