అప్పుడు 'రంగస్థలం'.. ఇప్పుడు 'పుష్ప'!
on Apr 22, 2021
ఓవైపు టీవీ తెరపై టాప్ గ్లామరస్ యాంకర్గా రాణిస్తూనే, మరోవైపు వెండితెరపై ఆసక్తికర పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని రంజింపజేస్తూ వస్తోంది అనసూయ భరద్వాజ్. సుకుమార్ సినిమా 'రంగస్థలం'లో రంగమ్మత్త పాత్ర ఆమెకు ఎంత పేరు తెచ్చిందో మనకు తెలుసు. ఆ సినిమా విడుదలయ్యాక ఆమెను "రంగమ్మత్త" అంటూ పిలవడం మొదలుపెట్టారు జనం. భర్త చనిపోయిన బడబాగ్ని లాంటి దుఃఖాన్ని గుండెల్లో దాచుకొని, పైకి హుషారుగా కనిపించే రంగమ్మత్త పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు అందర్నీ మెప్పించింది.
ఇప్పుడు అల్లు అర్జున్ టైటిల్ పాత్రధారిగా రూపొందుతోన్న 'పుష్ప'లోనూ అనసూయ కోసం సుకుమార్ మరో మంచి పాత్రను సృష్టించాడు. ఆ పాత్ర ఏమిటనేది వెల్లడి కాకపోయినా రంగమ్మత్త తరహాలోనే కథలో ఒక కీలక పాత్ర అని తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు 'పుష్ప' షూటింగ్ కొన్ని రోజులు ఆగిపోయి, మళ్లీ కొనసాగుతోంది. లేటెస్ట్గా అనసూయపై కొన్ని సీన్లను డైరెక్టర్ సుకుమార్ పిక్చరైజ్ చేస్తున్నాడు. ఈ ఆనందాన్ని దాచుకోకుండా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసుకుంది అనసూయ.
'పుష్ప' క్లాప్ బోర్డ్ను షేర్ చేసిన ఆమె, దానికి "#GoodDaysAhead #HappyToBeBackAgain #Gratitude @aryasukku @alluarjunonline @mythriofficial Let’s get ‘em all again." అంటూ రాసుకొచ్చింది.
మళ్లీ ఆ యూనిట్ను కలుసుకున్న ఆనందంతోనూ, ఆ సినిమా చేస్తున్నందుకు కృతజ్ఞతతో ఉంటానని చెప్పడాన్ని బట్టి, తన క్యారెక్టర్ను ఆమె ఎంతగా ప్రేమిస్తోందో ఊహించుకోవచ్చు. ఆమె షేర్ చేసిన క్లాప్ బోర్డులో సీన్ నంబర్ 27ఎ అని ఉంది. అంటే అది ఫస్టాఫ్లో వచ్చే సీన్ అని తెలిసిపోతోంది. 'రంగస్థలం' తరహాలోనే 'పుష్ప'తోనూ అనసూయ ఆకట్టుకుంటుందన్న మాటే!
Also Read