అమితాబ్ మెడ చుట్టూ బిగుస్తున్నపనామా పాము..!
on Apr 21, 2016
దేశప్రజల నుంచి అత్యంత గౌరవం పొందే వ్యక్తుల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. సినీ కెరీర్ తో పాటు, తన జీవితంలో కూడా ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన అమితాబ్ అంటే భాషతో సంబంధం లేకుండా భారతదేశమంతటా గౌరవిస్తారు. కానీ పనామా పేపర్స్ ఉదంతం, ఆయన గౌరవానికి భంగం కలిగించేలా కనిపిస్తోంది. విదేశాల్లో ఆయన నల్లధనం పెట్టుబడుల గురించి పనామా పత్రాల్లో మరిన్ని విషయాలున్నాయంటూ జాతీయ మీడియా చెబుతోంది. పనామా పత్రాలు ఆయన నాలుగు విదేశీ కంపెనీలకు డైరెక్టర్ గా వ్యవహరించారంటూ పేర్కొన్నాయి.
90 వ దశకంలో అనేక విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి, ఆ కంపెనీల్లో బిగ్ బీ చాలా కీలక పాత్రల్లో ఉన్నారని పనామా పేపర్స్ చెబుతున్నాయి. ట్రంప్ షిప్పింగ్ లిమిటెడ్, సీ బల్క్ షిప్పింగ్ కంపెనీల బోర్డు సమావేశాల్లో కూడా అమితాబ్ పాల్గొన్నారని వాటిలో ఉంది. మరో వైపు బిగ్ బి మాత్రం, ఈ ఆరోపణల్ని ఖండించారు. తాను ఇప్పటికే తనపై వచ్చిన ఆరోపణలకు ప్రభుత్వానికి సమాధానం ఇచ్చానని, ఇంకా కావాలంటే మళ్లీ విచారణకు సహకరిస్తానని బిగ్ బచ్చన్ చెబుతున్నారు. నల్ల ధన కుబేరుల వివరాలు వెల్లడించి సంచలనం సృష్టించిన పనామా పేపర్స్, అమితాబ్ కూడా నల్లధనం దాచుకున్న వారిలో ఉన్నారంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే.