బిగ్ న్యూస్: 'అల్లు స్టూడియోస్'కు శంకుస్థాపన చేసిన 'అల్లు ఫ్యామిలీ'!
on Oct 1, 2020
'అల్లు ఫ్యామిలీ' నుంచి బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ వచ్చింది. 'అల్లు స్టూడియోస్'ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ ఫ్యామిలీ ప్రకటించింది. అంతేకాదు, స్టూడియో నిర్మాణానికి శంకుస్థాపన సైతం చేసింది. అక్టోబర్ 1 గురువారం దివంగత అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా అల్లు ఫ్యామిలీ నుంచి పెద్ద ప్రకటన రానున్నదని ముందుగానే సమాచారం వచ్చింది. అందుకు తగ్గట్లే ఈరోజు 'అల్లు స్టూడియోస్' ఏర్పాటు ప్రకటనతో వారు ఆశ్చర్యపరిచారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అల్లు అర్జున్ షేర్ చేశాడు.
అల్లు రామలింగయ్య చిత్రపటం దగ్గర అల్లు అరవింద్, వెంకటేశ్, అర్జున్, శిరీష్.. నలుగురూ నిల్చొని ఉన్న పిక్చర్ను షేర్ చేసిన బన్నీ, "అక్టోబర్ 1 మన ప్రియతమ డాక్టర్ శ్రీ అల్లు రామలింగయ్య 99వ జయంతి. ఈ సందర్భంగా ఆయన స్మృత్యర్థం అల్లు స్టూడియోస్ నిర్మాణ పనులను అల్లు ఫ్యామిలీ ప్రారంభిస్తోంది. మా తాతయ్య లెగసీని సెలబ్రేట్ చేసుకుంటూ, అల్లు స్టూడియోస్ను ఆయనకు అంకితం ఇస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలతో అల్లు స్టూడియోస్ పనులను ప్రారంభిస్తున్నాం" అని పోస్ట్ చేశాడు. ఆ వెంటనే అల్లు ఫ్యామిలీ పేరిట మీడియాకు విడుదల చేసిన ప్రకటనను కూడా పోస్ట్ చేశాడు బన్నీ.
అల్లు రామలింగయ్య 1950ల మొదట్లో నటునిగా తన కెరీర్ను ప్రారంభించారు. అప్పట్నుంచీ దాదాపు ఏడు దశాబ్దాలుగా ఆయన కుటుంబం సినీ రంగానికి అంకితమవడం గమనార్హం. రామలింగయ్య కుమారుడు అరవింద్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా పేరు తెచ్చుకోగా, మనవడు అల్లు అర్జున్ టాప్ స్టార్స్లో ఒకడిగా రాణిస్తున్నాడు. మరో మనవడు శిరీష్ సైతం నటుడే. ఇప్పుడు అల్లు స్టూడియోస్తో ఆ కుటుంబం సినీ రంగంలో తమ స్థానాన్ని మరింతగా పదిలం చేసుకొనేందుకు అడుగు ముందుకేసింది.