మెగాస్టార్ లాగా నాగార్జున కూడా తోడుగా తెచ్చుకుంటున్నారు!
on Feb 8, 2023
రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు దాదాపు దశాబ్ద కాలం పాటు చిరు దూరంగా ఉన్నారు. కానీ మరలా ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. తమిళ కత్తికి రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం బాగానే ఆడింది. ఆ తర్వాత ఆయన సైరా నరసింహారెడ్డి అనే చిత్రం చేశారు. ఇందులో ఆయన తనకు తోడుగా అమితాబచ్చన్, సుదీప్ ,విజయ్ సేతుపతి వంటి వారిని తీసుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య చిత్రంలో తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోడుగా నటించారు.
ఆచార్య తర్వాత గాడ్ ఫాదర్ లోనూ ఇదే పరిస్థితి. బాలీవుడ్ క్రేజి స్టార్ సల్మాన్ ఖాన్ కీలక అతిధి పాత్రలో నటించగా యంగ్ హీరో సత్యదేవ్ విలన్ గా కనిపించారు. తాజాగా వాల్తేరు వీరయ్యలో మాస్ మహారాజా రవితేజ కీలకమైన పాత్రను పోషించారు. ఈ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకు ప్రధాన బలంగా ఈ క్యారెక్టర్ నిలిచింది. చిరు -రవితేజ ఇద్దరి క్యారెక్టర్స్ పవర్ఫుల్గా కుదరడంతో సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు కింగ్ నాగార్జున సైతం అలాగే ఆలోచిస్తున్నారు.
తన వందవ చిత్రాన్ని ఆయన గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్నారు. ఇందులో అఖిల్ కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఇక ధమాకా రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడని దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ చిత్రం చేయబోతున్నారు. దీనికి శ్రీనివాస చిట్టూరి నిర్మాత. ఇందులోనూ ఓ కీలక పాత్రలో మరో హీరో అయిన అల్లరినరేష్ నటించనున్నారట. గతంలో కూడా నాగార్జున ఊపిరి చిత్రంలో కార్తీతో, దేవదాసులో నానితో కలిసి నటించారు.
ఇప్పుడు ఇలాంటి స్ట్రాటర్జీనే ఫాలో అవుతున్నారు. ఆఫీసర్,వైల్డ్ డాగ్, దిఘోస్ట్, మన్మథుడు2 వంటి వరుస అపజయాలతో నాగ్ ఉన్నారు. వీటి మద్యలో కాస్త దేవదాస్, బంగార్రాజు ఫరవాలేదనిపించాయి. నాగార్జునకు సోగ్గాడే చిన్ని నాయనా తర్వాత మరలా ఆస్థాయి హిట్ రాలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సరిగా ఆడటం లేదు. దాంతో నాగార్జున తాజాగా తనతో పాటు మరొకరిని వెంట తీసుకుని రావాలనే నిర్ణయం తీసుకున్నారని సమాచారం.