'ఎవడు'లో విలన్ రోల్ కోసం ట్రై చేశా కానీ...
on Aug 17, 2019
రాంచరణ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన 'ఎవడు' (2014) మూవీ కమర్షియల్గా పెద్ద విజయం సాధించింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శ్రుతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటిస్తే, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ అతిథి పాత్రల్లో కనిపించారు. ఆ సినిమాలో మెయిన్ విలన్గా నటించాలని అడివి శేష్ అనుకున్నాడు. దాని కోసం ట్రై చేశాడు కూడా. కానీ అప్పటికి అతడు 'పంజా'లో సైడ్ విలన్గా చేసి వున్నాడు. కానీ దిల్ రాజు, వంశీ పైడిపల్లి అతడిని తీసుకోలేదు. వీరు భాయ్ అనే ఆ రోల్ను రాహుల్ దేవ్తో చేయించారు. ఫలానా రోల్ అని చెప్పకపోయినా ఆ సినిమాలో అతడు ట్రై చేసిన వీరు భాయ్ రోల్ కోసమేనని అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే.. మరో మెయిన్ విలన్ కేరెక్టర్ ధర్మా. అది వయసు మళ్లిన పాత్ర. దాన్ని సాయికుమార్ చేశారు.
'ఎవడు'లో విలన్ కేరెక్టర్ కోసం తాను ప్రయత్నించాననీ, కానీ అప్పటికి తనకంత పేరు లేకపోవడంతో ఆ రోల్ రాలేదని అనుకుంటున్నాననీ తాజాగా తన 'ఎవరు' మూవీ ప్రమోషన్ ఈవెంట్లో తెలిపాడు శేష్. 'ఎవరు' సినిమా చూశాక దిల్ రాజు తనతో సినిమా ఎప్పుడు చేస్తున్నావని అడిగారని అతను చెప్పాడు. ఈ విషయాన్ని దిల్ రాజు సైతం కన్ఫార్మ్ చేశారు. గాడ్ఫాదర్ లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదగలేమని కొంతమంది అంటుంటారనీ, కానీ గాడ్ఫాదర్ లేకపోయినా, ప్రతిభతో, స్వయంకృషితో ఇండస్ట్రీలో ఎదగవచ్చనేందుకు అడివి శేష్ నిదర్శనమనీ ఆయన ప్రశంసించారు. శేష్తో వెంటనే ఒక సినిమా మొదలు పెట్టాలని ఉందని కూడా ఆయన చెప్పారు.