ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ!
on Nov 30, 2022
'లైగర్' ఘోర పరాజయం నుంచి రౌడీ హీరో విజయ్ దేవరకొండ బయటకు రావాలని చూస్తున్నా ఆయనను ఆ చిత్రం వదిలేలా లేదు. ఆ చిత్ర లావాదేవీల విషయంలో తాజాగా ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యాడు.
విజయ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'లైగర్'. ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి, ఛార్మి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదలై ఘోర పరాజయం పాలైంది. భారీ ధరకు ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న బయ్యర్లు తీవ్రస్థాయిలో నష్టపోయారు. ఇదిలా ఉంటే కొందరు రాజకీయ నాయకులు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడానికి అక్రమ మార్గంలో ఈ సినిమాలో పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ విచారణ జరుపుతోంది.
విదేశీ పెట్టుబడుల చట్టాన్ని ఉల్లంఘించి నల్ల ధనాన్ని దుబాయికి పంపించి, అక్కడి నుంచి తిరిగి 'లైగర్' సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్ధిక లావాదేవీలు, విదేశీ పెట్టుబడులు తదితర అంశాలపై ఈడీ ఇప్పటికే పూరి, ఛార్మిలను విచారించింది. ఇక ఇప్పుడు తాజాగా విజయ్ ఈడీ విచారణకు హాజరయ్యాడు. ఆయనను లైగర్ ఆర్ధిక వ్యవహారాలతో పాటు పారితోషికం గురించి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read