వైష్ణవ్.. ఈ సారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్
on Apr 3, 2021
బ్లాక్ బస్టర్ మూవీ `ఉప్పెన`తో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యాడు వైష్ణవ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, `సుప్రీమ్` హీరో సాయితేజ్ తమ్ముడు అనే ట్యాగ్స్ తో ఎంట్రీ ఇచ్చినా.. ఫస్ట్ ఎటెంప్ట్ లోనే ఇంప్రెస్ చేశాడు. నటుడిగా మార్కులు పొందాడు. త్వరలోనే క్రిష్ డైరెక్ట్ చేస్తున్న సినిమాతో పలకరించనున్నాడు ఈ యంగ్ హీరో. ప్రసిద్ధ నవల `కొండ పొలం` ఆధారంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కింది. ఆ తరువాత `అర్జున్ రెడ్డి` తమిళ వెర్షన్ `ఆదిత్య వర్మ` దర్శకుడు గిరీశయ్య తెరకెక్కిస్తున్న సినిమాతో సందడి చేయనున్నాడు వైష్ణవ్.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తన తొలి మూడు చిత్రాలకు ఒకదానితో ఒకటి సంబంధం లేని జోనర్స్ ను ఎంచుకుని టాక్ ఆఫ్ టాలీవుడ్ అవుతున్నాడు వైష్ణవ్ తేజ్. అతని మొదటి ప్రయత్నం `ఉప్పెన` రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా.. రెండో చిత్రం యాక్షన్ ఎడ్వెంచరస్ మూవీగా రాబోతోంది. ఇక మూడో సినిమా విషయానికొస్తే.. ఇదో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని టాక్. మొత్తమ్మీద.. వైష్ణవ్ తేజ్ చక్కని ప్రణాళికతోనే కథానాయకుడిగా ముందుకు సాగుతున్నాడు. మరి.. రాబోయే చిత్రాలతోనూ ఈ మెగా కాంపౌండ్ యంగ్ హీరో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.