శ్రీదేవి అంటే మనసును మెలిపెట్టే జ్ఙాపకం!
on Feb 26, 2018
చలికాలపు ఉషోదయపు వేళ మంచు.. తెరలు తెరలుగా కమ్మేస్తుంటే... ఆ తెరలను చీల్చుకుంటూ దూసుకొచ్చిన రవికిరణాల నులివెచ్చని వేడి పుడమిని సైతం పులకింపజేస్తుంటే... ఆ ఆహ్లాదకర వేళ... పచ్చని పంట చేల మధ్య... పాలకంకిలా... స్వేతవర్ణకాంతిలో.ఓ పదహారేళ్ల ముగ్థ మనోహరం ఉయ్యాలలూగుతూ కనిపిస్తే.. గుండె బరువెక్కదా? రుధిరం వేడెక్కదా? సరిగ్గా... 39 ఏళ్ల క్రితం ఇలాగే... తెరపై సాక్షత్కరించింది ఓ రసాధిదేవత. ఆమెను చూసి... యువతరం విరహ వేదనతో విలవలలాడింది. దేవకాంతలకు మాత్రమే సాధ్యమైన అంతటి సౌందర్యం మానవకాంతకా? అంటూ ఆశ్చర్యపోయింది. కొందరైతే అమాయకంగా ప్రేమించారు.
ఇంకొందరైతే ఊహాలోకాల్లో విహరించారు. ఆ జ్ఙాపకాలను నెమరువేసుకుంటూ.. నేటికీ పులకిస్తూనే ఉన్నారు. ఆమె ‘శ్రీదేవి‘. ప్రస్తుతం ఏవేవో పాడు వార్తలు వినిపిస్తున్నాయ్. వాటిని ఖాతరు చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే.. శ్రీదేవి అంటేనే మనసును మెలిపెట్టే జ్ఙాపకం. నిన్నటి దాకా అదే జ్ఙాపకాలతో బతుకుతోంది అభిమానలోకం. టీవీల్లో... పాటలు చూసి పలవరించిపోతోంది. ఇప్పుడూ అంతే.. రేపూ అంతే... జీవితాంతం అంతే. ఇక శ్రీదేవి లేందెప్పుడు? కోట్లాదిమంది అభిమానామృతం తాగిన అప్సరస శ్రీదేవి . ఆమెకు మరణం లేదు. భౌతికత అనేది... దేవునికి సంంధించిన విషయం.
ఎంత గొప్ప ప్రయాణమైనా ఎక్కడో ఒక చోట... ఎప్పుడో ఒకప్పుడు ఆగిపోతుంది. కానీ... జ్ఙాపకాలు మాత్రం కాలంతో పాటు ప్రవహిస్తూనే ఉంటాయ్. అవి ప్రాణం కంటే ముందే గాలిలో కలిసుంటాయ్. తరాలు మారనీ.. యుగాలు మారనీ... గాలి వీస్తున్నంత కాలం.. అవి వినిపిస్తూనే ఉంటాయ్. జ్ఙాపకాలని తీసుకెళ్లే దేవుడు ఇంకా ఏ గుళ్లో పుట్టలేదు.
Also Read