రజనీకాంత్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న అభిమాని బతికాడు!
on Sep 18, 2020
ముంబై మహానగరంలో ఉంటున్న మురళికి రజినీకాంత్ అంటే పిచ్చి. రజనీకి అతడు వీరాభిమాని. తమిళనాడు రాష్ట్రానికి రజిని ముఖ్యమంత్రి అయితే చూడాలని కోరుకున్నాడు. కానీ, కరోనా బారిన పడడంతో తన కోరిక తీరకుండా మరణిస్తానేమో అని భయపడ్డాడు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... అతడు కరోనా నుంచి కోలుకున్నాడు. బతికాడు. ఈ రజనీకాంత్ అభిమాని కథేంటి? అనే వివరాల్లోకి వెళితే...
సెప్టెంబర్ 16న దర్శన్ అనే యువకుడి సోషల్ మీడియా హ్యాండిల్ లో ఒక వీడియో పోస్ట్ అయింది. అందులో దర్శన్ తండ్రి మురళి ఉన్నాడు. ఒక ఆసుపత్రిలో కొవిడ్-19 చికిత్స తీసుకుంటున్న అతడు రజనీకాంత్ ముఖ్యమంత్రి అయితే చూడాలనేది తన కోరిక అని, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో రజని విజయం సాధించి ముఖ్యమంత్రిగా స్పీచ్ ఇచ్చే సమయానికి తాను బ్రతికి ఉండనేమోనని ఆ వీడియోలో మురళీ పేర్కొన్నారు.
మురళికి రజనీకాంత్ ఆడియో సందేశం పంపించారు. అందులో "నేను రజనీకాంత్ మాట్లాడుతున్నాను. మీకు ఏమీ కాదు. భయపడకండి. ఆందోళన చెందకండి. త్వరగా కోలుకుంటారు. మీరు త్వరగా కోలుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. డిశ్చార్జి అయిన తర్వాత కుటుంబంతో కలిసి ఒకసారి మా ఇంటికి రండి" అని రజనీకాంత్ పేర్కొన్నారు.
రజనీకాంత్ ఆశీస్సులతో కరోనా నుండి కోలుకున్నానని సెప్టెంబర్ 17న మురళి తెలిపారు. కోవిడ్-19 టెస్ట్ రిజల్ట్స్ నెగిటివ్ వచ్చాయని తన కిడ్నీ కూడా సరిగా పని చేస్తుందని ఆయన అన్నారు.