జాన్వీ కపూర్ ఆటోగ్రాఫ్ తీసుకున్న రాజమౌళి!
on Mar 23, 2023
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ 'ఎన్టీఆర్ 30'(వర్కింగ్ టైటిల్). యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎస్.ఎస్.రాజమౌళి, ప్రశాంత్ నీల్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే రాజమౌళి ఆమెతో ప్రత్యేకంగా ముచ్చటించి, ఆమె ఆటోగ్రాఫ్ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
జాన్వీ కపూర్- రాజమౌళి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం, ఏవో పేపర్లపైన జాన్వీ సంతకం పెట్టడం చూసి.. వీరిద్దరి మధ్య సినిమాకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే రాజమౌళి తన కూతురు మయూఖ కోసం జాన్వీ కపూర్ ఆటోగ్రాఫ్ తీసుకున్నారట. మయూఖ జాన్వీకి అభిమాని కావడంతో.. 'ఎన్టీఆర్ 30' మూవీ లాంచ్ కి వెళ్తున్న తన తండ్రి రాజమౌళిని జాన్వీ ఆటోగ్రాఫ్ తీసుకురమ్మని కోరిందట. కూతురు కోరిక మేరకు రాజమౌళి జాన్వీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారట. ఏది ఏమైనా రాజమౌళి లాంటి బడా డైరెక్టర్ యంగ్ హీరోయిన్ జాన్వీ ఆటోగ్రాఫ్ తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.