స్టార్ సినిమాటోగ్రాఫర్ కి `రౌడీ బాయ్స్`తోనే ఫస్ట్ టైమ్!
on Jan 7, 2022
దక్షిణాది అగ్రశ్రేణి ఛాయాగ్రాహకుల్లో ఆర్. మది ఒకరు. తరుణ్, స్నేహ, కునాల్, ప్రీతా ముఖ్య పాత్రల్లో నటించిన తమిళ చిత్రం `పున్నగై దేశమ్` (తెలుగులో `నవ వసంతం`గా రీమేక్ అయింది) తో సినిమాటోగ్రాఫర్ గా తొలి అడుగేసిన మది.. ఆరంభంలో మాతృభాషకే పరిమితమైనా `మిర్చి` చిత్రంతో టాలీవుడ్ బాట పట్టారు. మొదటి తెలుగు సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుని వార్తల్లో నిలిచారు. ఆపై `రన్ రాజా రన్`, `శ్రీమంతుడు`, `ఘాజీ`, `భాగమతి`, `సాహో` చిత్రాలతో స్టార్ సినిమాటోగ్రాఫర్ అనిపించుకున్నారు.
కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం మది నుంచి మరో తెలుగు చిత్రం వస్తోంది. ఆ సినిమానే.. `రౌడీ బాయ్స్`. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు బేనర్ లో మది మొదటిసారిగా పనిచేసిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్ లోకి రాబోతోంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తమిళనాట మది కెమెరామెన్ గా పనిచేసిన తొలి సినిమానే పొంగల్ రిలీజ్ కాగా.. తెలుగులో మాత్రం ఏడో చిత్రంతో సంక్రాంతి బరిలో ఫస్ట్ టైమ్ సందడి చేయనున్నారు. మరి.. టాలీవుడ్ ఫస్ట్ సంక్రాంతి రిలీజ్ మదికి గుర్తుండిపోయే ఫలితాన్ని ఇస్తుందేమో చూడాలి.
అన్నట్టు.. జనవరి 7 ఆర్. మది పుట్టినరోజు. నేటితో 51 వసంతాలను పూర్తిచేసుకుంటున్నారు ఈ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్.