ప్రియ పోయే... పూర్ణ వచ్చే!
on Feb 25, 2020
ప్రియ అంటే ప్రియమణి! ఆమె నటించాల్సిన పాత్ర ఇప్పుడు పూర్ణ దగ్గరకు వచ్చింది! తెలుగులో 'నువ్విలా నేనిలా', 'అవును' చిత్రాల్లో నటించిన హీరోయిన్ పూర్ణ గుర్తుందా? ఇప్పుడు రియాలిటీ షోలో జడ్జిగా చేస్తోంది. ఆ పూర్ణ!! అఫ్ కోర్స్... ప్రియమణి కూడా అదే షోలో జడ్జిగా చేస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే.... దివంగత నటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ 'తలైవి'. ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారు. జయలలిత నిచ్చెలి శశికళ పాత్రకు తొలుత ప్రియమణిని తీసుకున్నారు. ఇప్పుడు ఆ పాత్ర పూర్ణ దగ్గరకు వచ్చింది. 'తలైవి' దర్శకుడు కావాలనే ప్రియమణి తప్పించి పూర్ణను తీసుకోలేదు. ప్రియమణి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె చేయలేనని సినిమా నుండి తప్పుకున్నారు. దాంతో పూర్ణను ఎంపిక చేశారు. అది సంగతి!! నటిగా పూర్ణకూ ఇది చాలా పెద్ద అవకాశం అని చెప్పాలి.
ఇటీవల కాలంలో ఆమెకు కథానాయికగా అవకాశాలు తగ్గాయి. కొన్ని పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు. మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమాలో అయితే ఒక పాటలో తళుక్కుమని మెరిశారు. ఈ సమయంలో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్న 'తలైవి'లో ఆమెకు శశికళ పాత్ర చేసే అవకాశం వచ్చింది. కంగనా రనౌత్ క్రేజ్ వల్ల సినిమాకు ఓపెనింగ్స్ గట్టిగా వస్తాయని బలంగా చెప్పవచ్చు. పైగా, జయలలిత బయోపిక్ కదా! ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి ఉంటుంది. శశికళ పాత్రను పూర్ణ బాగా నటిస్తే మళ్ళీ ఆమె కెరీర్ స్పీడ్ గా పరుగులు తీస్తుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
