పవన్-త్రివిక్రమ్ ల సాహితీ చర్చ.. 'శ్రీశ్రీ శిఖరం.. మనం గులక రాళ్ళు'...
on Sep 18, 2021
టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ల పేర్లు ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. వీరిద్దరూ మంచి స్నేహితులు. ఒకరంటే ఒకరికి అభిమానం. ఇద్దరూ పుస్తకాల పురుగులు.. సాహితీ ప్రియులు. అందుకేనేమో వీరిద్దరూ కలిసి ఎన్ని సినిమాలు చేసినా.. వీరి మధ్య సినిమా ముచ్చట్ల కంటే.. సాహిత్యం గురించిన కబుర్లే ఎక్కువగా సాగిపోతుంటాయి.
పవన్-త్రివిక్రమ్ కలసినప్పుడల్లా ముచ్చట్లలో మునిగిపోతుంటారు. దీంతో అసలు వాళ్ళు.. ఏం ముచ్చట్లు చెప్పుకుంటారు? ఏ సంగతులు వారి మాటల ప్రవాహంలో దొర్లుతుంటాయి? అన్న సందేహాలు వ్యక్తమవుతాయి. అయితే వారిద్దరి గురించి బాగా తెలిసిన వారు చెప్పే మాట ఒక్కటే.. 'ఆ ఇద్దరూ సాహితీ చర్చల్లో ఉన్నారు' అని. అవును పవన్-త్రివిక్రమ్ కలిస్తే.. శ్రీశ్రీ సాహిత్యం నుంచి శేషేంద్ర ఆధునిక మహాభారతం వరకూ.. చిన్నయసూరి వ్యాకరణం నుంచి తెలుగు శతకాల వరకూ.. జాషువా కవిత్వం నుంచి చలం రచనల వరకూ.. కొడవటిగంటి కథల నుంచి మధుబాబు డిటెక్టివ్ నవలల వరకూ తెలుగు సాహిత్యం గురించి కబుర్లు ప్రవాహంలా సాగిపోతుంటాయి.
సాహితీ మిత్రులు పవన్, త్రివిక్రమ్ శుక్రవారం సాయంత్రం 'భీమ్లా నాయక్' సెట్లో మహాకవి శ్రీశ్రీ రచన గురించి మాట్లాడుకున్నారు. శ్రీశ్రీ చేతిరాతతో ఉన్న మహా ప్రస్థానం ప్రత్యేక స్మరణికను పవన్.. త్రివిక్రమ్ కి జ్ఞాపికగా అందచేశారు. ఆ పుస్తక ముద్రణ, అందులోని అరుదైన చిత్రాల గురించి వీరు చర్చించుకున్నారు.
ఆ సమయంలో "శ్రీశ్రీ కవిత్వం గురించి రెండు మాటలు చెప్పండి.. మీరు చెబితే వచ్చే అందం వేరు" అని త్రివిక్రమ్ ని పవన్ కోరారు. ఇందుకు త్రివిక్రమ్ స్పందిస్తూ "కవి తాలూకు ప్రయాణం అంటే ఒక జాతి తాలూకు ప్రయాణం. ఆయన వేసిన ఒక అడుగు.. రాసిన ఒక పుస్తకం.. ఒక శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటుంది.. చాలా శతాబ్దాలపాటు మాట్లాడుకొంటూనే ఉంటుంది. ఆయన తాలూకు జ్ఞాపకం మన జాతి పాడుకునే గీతం. శ్రీశ్రీ తెలుగువాళ్లు గర్వించదగ్గ కవి.. ఈ శతాబ్దం నాది అని గర్వంగా చాటినవాడు. తెలంగాణ విమోచన దినోత్సవం రోజు ఆయన పుస్తకం చూడడం నిజంగా గొప్ప విషయం. ఆయన ఆత్మ ఎక్కడున్నా స్వతంత్రం అనే సరికి అక్కడికి వచ్చి ఆగుతుంది" అన్నారు. ఇందుకు పవన్ మాట్లాడుతూ.. "ఒక కవి గురించి మరో కవి చెబితే వచ్చే సొబగు ఇది" అన్నారు. వెంటనే త్రివిక్రమ్ స్పందించి "శ్రీశ్రీ ఒక సమున్నత శిఖరం. మనందరం ఆ శిఖరం దగ్గరి గులక రాళ్లు" అన్నారు.
Also Read