ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం 'నేనెవరు' : రాజేంద్ర ప్రసాద్
on Sep 11, 2025

ఇటీవల కాలంలో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న నటకిరీటి డా: రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్ర పోషించిన "నేనెవరు?" చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, దసరా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆడియో మరియు టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ మాజీ మేయర్, మాజీ శాసనసభ్యులు, ప్రముఖ విద్యావేత్త తీగల కృష్ణారెడ్డి, ప్రముఖ దర్శకులు వి.సముద్ర ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుకలో రాజేంద్రప్రసాద్ పాల్గొని, ఈ చిత్రంలో నటించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసి, దర్శకుడిగా చిరంజీవికి ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు.
"నేను నటించిన మంచి సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయే చిత్రం "నేనెవరు?". దర్శకుడు చిరంజీవి ఈ కథ నాకు చెప్పినప్పుడు లిటరల్ గా షాక్ అయ్యాను. ఇంత గొప్ప కథను కరెక్ట్ గా తెరకెక్కించగలడా అని సందేహపడ్డాను కూడా. కానీ షూటింగ్ కి వెళ్ళాక కానీ... అతను ఎంత జీనియస్ అన్నది అర్ధం కాలేదు. నిర్మాతలు కూడా ఎంతో తపన, నిబద్ధత కలిగిన వ్యక్తులు. వాళ్ళకు "నేనెవరు?" చిత్రంతో ఘన విజయం సొంతం కావాలి" అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

"నువ్వేకావాలి, ప్రేమించు" వంటి సూపర్ హిట్ ఫిల్మ్స్ ఫేమ్ సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రల్లో చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో సందేశభరిత వినోదాత్మకంగా "నేనెవరు?" చిత్రం తెరకెక్కింది. సరికొండ మల్లిఖార్జున్ సమర్పణలో జై చిరంజీవ మూవీ మేకర్స్ పతాకంపై అండేకర్ జగదీష్ బాబు - సకినాన భూలక్ష్మి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంతో వైజాగ్ సత్యానంద్ శిష్యులు అభిలాష్, సాయిచెర్రి హీరోలుగా పరిచయమవుతున్నారు. దీపిక - సోనాక్షి జబర్దస్త్ రాజమౌళి ఇతర పాత్రలు పోషించారు. రాజేంద్రప్రసాద్ వంటి లెజెండరీ ఆర్టిస్టుతో "నేనెవరు?" చిత్రం రూపొందించే అవకాశం లభించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని దర్శకనిర్మాతలు అన్నారు. దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇంత గొప్ప చిత్రంలో పార్ట్ అవ్వడం గర్వంగా ఉందని నటీనటులు, యూనిట్ సభ్యులు అన్నారు.
చిన్నికృష్ణ సంగీతం అందిస్తున్న "నేనెవరు?" చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా నాయుడు ప్రసాద్ కొల్లి, ఎడిటర్స్ గా నందమూరి హరి, తారకరామారావు వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



