'మన్మథుడు 2'తో సై అంటున్న అనసూయ!
on Aug 3, 2019
మూడేళ్ల క్రితం వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాలో నాగార్జున మరదలిగా స్పెషల్ రోల్ చేసి, ఆయనతో ఆడి పాడి అలరించింది టీవీ యాంకర్ నుంచి సినీ నటిగా మారిన అనసూయ. ఇప్పుడు ఆమె ఏకంగా నాగ్తో బాక్సాఫీస్ దగ్గర సై అంటే సై అంటోంది. ఆమె లీడ్ రోల్ చేసిన 'కథనం' మూవీ ఆగస్ట్ 9న రిలీజ్ అవుతోంది. అయితే అదే రోజు నాగార్జున సినిమా 'మన్మథుడు 2' విడుదలవుతుండటం గమనార్హం. నిజానికి నాగార్జున సినిమాకు అనసూయ సినిమా పోటీయా? అనే ప్రశ్న రావచ్చు. అయితే 'క్షణం', 'రంగస్థలం' సినిమాల్లో చేసిన పాత్రలతో అనసూయకు నటిగా సొంత గుర్తింపు వచ్చింది. 'క్షణం'లో నెగటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ను ఎంతో ఈజ్తో చేసిన ఆమె, 'రంగస్థలం'లో రంగమ్మత్త పాత్రలో ఇట్టే ఇమిడిపోయింది.
ఇప్పుడు 'కథనం'లో ఆమె డైరెక్టర్ కావాలని ఆశించే అసిస్టెంట్ డైరెక్టర్ కేరెక్టర్లో కనిపించనున్నది. తనే కథలు రాస్తూ నిర్మాతలకు వినిపిస్తుంటుంది. ఆమె తీసే సినిమాలో హీరో కావాలని ప్రయత్నించే కేరెక్టర్ను ధన్రాజ్ చేశాడు. 'మన్మథుడు 2' విడుదలవుతున్న రోజే 'కథనం'ను ఎందుకు రిలీజ్ చేస్తున్నట్లు? ఆగస్ట్ 9 నుంచి వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉండటం వల్లా, ఆ వెంటనే ఆగస్ట్ 15, ఆ తర్వాత వీకెండ్ ఉండటంతో ఇంతకంటే మంచి డేట్ దొరకదనే ఉద్దేశంతో నిర్మాత ఆ డేట్ని ఎంచుకున్నారు. దాంతో బాక్సాఫీస్ దగ్గర నాగార్జున, అనసూయ ఫైట్ తప్పడం లేదు.