ప్రభాస్ చేయాల్సిన 'స్టూడెంట్ నెం.1' ఎన్టీఆర్ చేశాడు!
on Aug 12, 2022
'నిన్ను చూడాలని'(2001) సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్.. తాను నటించిన రెండో సినిమా 'స్టూడెంట్ నెం.1'తో మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. స్వప్న సినిమా(వైజయంతి మూవీస్) నిర్మించిన ఈ సినిమాతోనే ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడిగా పరిచయం కావడం విశేషం. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, రాజమౌళి ఇక వెనక్కి తిరిగి చూస్కోకుండా స్టార్స్ గా ఎదిగారు. అయితే నిజానికి ఈ సినిమాలో మొదట ప్రభాస్ ని హీరోగా అనుకున్నారట.
'రాజకుమారుడు'(1999)తో మహేష్ బాబు, 'చిరుత'(2007)తో రామ్ చరణ్.. వైజయంతి మూవీస్ బ్యానర్ పైనే హీరోలుగా పరిచయమయ్యారు. అయితే నిజానికి ప్రభాస్ కూడా 'స్టూడెంట్ నెం.1' సినిమాతో వైజయంతి ద్వారానే పరిచయం కావాల్సి ఉండగా మిస్ అయింది. తాజాగా ఈ విషయాన్ని నిర్మాత అశ్వినీదత్ రివీల్ చేశారు.
ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్న అశ్వినీదత్.. 'స్టూడెంట్ నెం.1' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదట ఆ సినిమాని ప్రభాస్ తో చేయాలనుకున్నామని, కానీ చాలా చర్చల తర్వాత చివరికి తారక్ తో చేశామని అన్నారు. ప్రభాస్ 2002 లో వచ్చిన 'ఈశ్వర్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ 'స్టూడెంట్ నెం.1' చేసినట్లయితే ఒక ఏడాది ముందే సూపర్ హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఉండేవాడు.
అయితే 'స్టూడెంట్ నెం.1' భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ.. రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమాల్లో తనకు ఆ ఒక్క సినిమా నచ్చదని గతంలో ఓ సినిమా వేడుకలో ప్రభాస్ చెప్పడం విశేషం.
Also Read