'మేజర్' ప్రీమియర్ షో.. 'జై హింద్' నినాదాలతో స్టాండింగ్ ఒవేషన్
on May 25, 2022
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ 'మేజర్'. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి శశి కిరణ్ తిక్క దర్శకుడు. సోనీ పిక్చర్స్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా జూన్ 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్ కి పదిరోజుల ముందే మే 24 నుంచి ప్రీరిలీజ్ ఫిల్మ్ స్క్రీనింగ్ ఉంటుందని ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పూణేలో మేజర్ స్క్రీనింగ్ జరగగా 'జై హింద్' నినాదాలతో థియేటర్ మారుమోగిపోయింది.
పూణేలో జరిగిన మేజర్ స్క్రీనింగ్ అడివి శేష్ తో పాటు మూవీ టీమ్ హాజరయ్యారు. సినిమా అయిపోగానే థియేటర్ లోని ప్రేక్షకులంతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి చప్పట్ల వర్షం కురిపించారు. పలువురు ప్రేక్షకులు జాతీయ జెండాలు పట్టుకొని 'జై హింద్', 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేశారు. అంతేకాదు ఈ ప్రీమియర్ కి తన భార్య లెఫ్టినెంట్ కల్నల్ శివప్రియతో కలిసి 21 పారా ఎస్ఎఫ్ కి చెందిన మాజీ కమాండో శివరాజ్ హాజరయ్యారు. ఆయన నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ వీల్ చైర్ లో ఈ సినిమా చూడటానికి రావడం విశేషం. ఆయనతో అడివి శేష్ ప్రత్యేకంగా సంభాషించాడు. ఆ సమయంలో తనకి సినిమా చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయి అని ఆయన చెప్పడంతో పాటు.. మిగతా ఆడియన్స్ తో కలిసి 'జై హింద్', 'భారత్ మాతాకీ జై' నినాదాలు చేశారు. దీంతో అడివి శేష్ ఆయనను హత్తుకొని తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన అడివి శేష్.. ఇవన్నీ నిజాయితీతో దక్కిన ప్రశంసలు అంటూ పొంగిపోయాడు. మేజర్ ట్రైలర్ చూసినప్పుడే ఈ సినిమా ఎప్పుడెప్పుడా చూడాలా అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పుడు ప్రీరిలీజ్ ఫిల్మ్ స్క్రీనింగ్ లో సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి సినిమా చూడాలన్న ఆసక్తి మరింత పెరుగుతోంది.
Also Read