'కార్తికేయ-2' ట్రైలర్.. ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు
on Jun 24, 2022
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ' సినిమా 2014 అక్టోబర్ లో విడుదలై ఘన విజయం సాధించింది. యానిమల్ హిప్నటిజం కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో 'కార్తికేయ-2' వస్తున్న సంగతి తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.
'కార్తికేయ-2' ట్రైలర్-1 ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివి గల ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 'కార్తికేయ'ను మించి చాలా పెద్ద స్థాయిలో 'కార్తికేయ-2' ఉండనుందని ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. 'కార్తికేయ' కథ ఒక గుడి నేపథ్యంలో జరగగా.. 'కార్తికేయ-2' కథ శ్రీకృష్ణుడి నేపథ్యంలో ఉండనుంది. "ప్రాణ త్యాగం చేసే తెగింపు ఉంటేనే దానిని పొందగలవు" అంటూ ట్రైలర్ లో వినిపించిన డైలాగ్ ని బట్టి చూస్తే.. ఏదో ఒక విలువైన దానిని వెతుక్కుంటూ ఓ వైపు హీరో, మరోవైపు విలన్ గ్యాంగ్ వెళ్లనున్నారని అనిపిస్తోంది. వాళ్ళ వెతుకులాట దేనికొరకు? అసలు ఈ కథకి, శ్రీకృష్ణుడికి సంబంధమేంటి? వంటి ప్రశ్నలతో సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది ట్రైలర్. ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. జూలై 22న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.