ఎన్టీఆర్ తో రాజమౌళి 'గరుడ'.. వెయ్యి కోట్ల బడ్జెట్!
on Sep 18, 2022
టాలీవుడ్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ కి ప్రత్యేక క్రేజ్ ఉంది. తారక్ హీరోగా నటించిన 'స్టూడెంట్ నెం.1' చిత్రంతోనే రాజమౌళి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత వీరి కాంబోలో 'సింహాద్రి', 'యమదొంగ' సినిమాలు వచ్చాయి. ఈ హ్యాట్రిక్ కాంబోలో ఈ ఏడాది వచ్చిన 'ఆర్ఆర్ఆర్'తో తారక్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి విజన్ కి హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే తారక్, రాజమౌళి కలయికలో ఇప్పటిదాకా నాలుగు సినిమాలు రాగా, ఇప్పుడు ఐదో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది.
'బాహుబలి' ఫ్రాంచైజ్ తర్వాత రాజమౌళి.. తారక్ తో 'గరుడ' అనే భారీ బడ్జెట్ చేయాలనుకున్నాడు. 'తారక్, రాజమౌళి కాంబోలో గరుడ' అనే వార్త అప్పట్లో మారుమోగిపోయింది. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. మరోవైపు తారక్, రామ్ చరణ్ హీరోలుగా 'ఆర్ఆర్ఆర్' చేశాడు రాజమౌళి. దీంతో 'గరుడ' గురించి అందరూ మర్చిపోయారు. ప్రస్తుతం రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత తారక్ తో 'గరుడ' చేస్తాడని ప్రచారం జరుగుతోంది.
తారక్ అంటే ఎంతో ఇష్టమని రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పాడు. తనతో కలిసి పని చేయడం ఇష్టమని, తారక్ తో చేసే ప్రతి సినిమా అతని కెరీర్ కి ఉపయోగపడేలా చేస్తానని రాజమౌళి అప్పట్లో అన్నాడు. అందుకు తగ్గట్లే తారక్ తో గరుడను రాజమౌళి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడట. మహేష్ ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి చేసే సినిమా ఇదే అంటున్నారు. అంతేకాదు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడని టాక్. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి రాజమౌళి, కరణ్ మధ్య చర్చలు కూడా జరిగాయని వార్తలొస్తున్నాయి.
Also Read