ఘాజీ మూవీ రివ్యూ
on Feb 17, 2017
తెలుగు సినిమా ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. కొత్త కథలొస్తున్నాయ్. దర్శకులు ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకూ కమర్షియల్ ఛట్రంలో ఉన్న తెలుగు సినిమా అందులోంచి పూర్తిగా బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న సంధికాలమిది. ఇలాంటి దశలోనే కొన్ని మంచి సినిమాలు రావాలి! సినిమా అంటే ఇదీ.. ఇలా తీయాలి అంటూ పాఠాలు నేర్పాలి. ఓ బలమైన ఎమోషన్ని గుండెల్ని తాకేలా అందించాలి. అలాంటి ప్రయత్నాలు ఎన్ని జరిగితే.. అంత వేగంగా తెలుగు సినిమా మారుతుంది. ఇందులో భాగంగానే 'ఘాజీ' వచ్చిందేమో అనిపిస్తుంది. ముగ్గురు నటులు.. ఒక సెట్... దేశ భక్తి - ఇదీ... 'ఘాజీ' ముడి సరుకు. అందులోనే బలమైన ఎమోషన్స్ పండించిన తీరు ఘాజీని ఓ ఉత్తమ చిత్రంగా మలిచింది.
* కథ
ఘాజీలో కథ కంటే భావోద్వేగాలు, సంఘర్షణ ప్రధానం. ఇండో - పాక్ యుద్ధాన్ని - ఈసారి సముద్ర గర్భంలో చూపించారు అంతే. యుద్ధం అంటే ఎప్పటికీ.. బలమైన భావోద్వేగమే. 'కావాలంటే నన్ను తిట్టు... నా దేశం జోలికి వచ్చావో' అంటూ ప్రతీ గుండె కదిలిపోయేంత దేశభక్తి భారతీయుల సొంతం. మనమంతా వేరే వేరే భాషలు, వేరే వేరే ప్రాంతాలు, వేరే వేరే మతాల ముసుగులో ఉన్నా.. దేశం జోలికి ఎవరైనా వస్తే ఆ ముసుగు తీసి ఎదిరిస్తాం.. జై హింద్ అంటూ నినదిస్తాం. ఆ భావన.. ఆ ఉద్వేగం తెరపై ఆవిష్కరించే ప్రయత్నం ఘాజీ.
1971 నాటి కథ ఇది. పాకిస్థాన్ రెండుగా విడిపోవడానికి ప్రసవ వేదన పడుతోంది. బంగ్లాదేశ్ని అణచాలంటే... దానిపై దాడి చేయాలి. అయితే అక్కడకు వెళ్లాలంటే సముద్ర మార్గమే దారి. అయితే.. భారత నావీని, నావీలో ప్రధాన అస్త్రమైన విక్రాంత్ని దాటుకెళ్లడం పాక్ ఆర్మీకి తలకు మించిన పని. అందుకే విక్రాంత్ని నాశనం చేయడం, విశాఖ పోర్ట్ని మేప్లో లేకుండా చేయడమే లక్ష్యంగా పాక్ ఓ కుట్ర పన్నుతుంది. అందులో భాగంగా ఘాజీని రంగంలోకి దింపుతుంది పాక్ ప్రభుత్వం. ఈ విషయం తెలుసుకొన్న ఇండియన్ నావీ... ఎస్ 21 అనే జలాంతర్గామితో కాపలా కాస్తుంది. ఘాజీకీ ఎస్ 21 కీ మధ్య జరిగే పోరే.. ఈ సినిమా కథ.
* తెలుగు వన్ విశ్లేషణ
ముందే చెప్పినట్టు కథ కంటే... భావోద్వేగాలకే పెద్ద పీట వేసిన చిత్రమిది. ఎస్ 21 వెళ్లిపోయి.. ఘాజీపై రెండు బాంబులు వేసేస్తే.. మజా ఏముంది? సినిమా అక్కడితో శుభం కార్డు వేసుకొంటుంది. ఘాజీని కూల్చడానికి ముందు దర్శకుడు సన్నివేశంపై సన్నివేశం పేర్చుకొంటూ వెళ్లాడు. ఇండియన్ నావీలో ఇద్దరు భిన్న ధృవాలు కలిగిన దేశభక్తుల్ని చూపించాడు. ఒకరేమో రానా, ఇంకొకరు కెకే మీనన్. ఇద్దరిలోనూ కొండంత దేశభక్తి. కానీ రానా ఏదైనా సరే... ప్రభుత్వ ఆజ్ఞ, చట్టం ప్రకారం చేయాలి అంటాడు. కేకే మీనన్ మాత్రం - శత్రువు ఎదురుగా ఉన్నప్పుడు ఆదేశాల కోసం ఎదురు చూడడం మూర్ఖత్వం అని వాదిస్తాడు.
ఫస్టాఫ్లో వీరి సంఘర్షణే కథకు మూలం. ఇక ద్వితీయార్థంలో ఎస్ 1.. ఘాజీపై ఎలా దాడి చేసింది, దేశం పరువుని, ప్రతిష్టనీ, విశాఖపట్నం పోర్ట్నీ, విక్రాంత్నీ ఎలా కాపాడింది? అనే పాయింట్ని బేస్ చేసుకొని నడిపించాడు. ద్వితీయార్థం ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు ముగిసిపోయిందో అర్థం కాదు. సన్నివేశాలు చక చక సాగిపోతుంటాయి. యుద్ధ రంగంలో గెలిచేది సైన్యం కాదు.. వ్యూహం అనేది ఓ పాపులర్ డైలాగ్. ఇక్కడా అంతే. ఇండో - పాక్ సైనికులు వ్యూహాలు ఉత్కంఠతని రేపుతాయి. ఘాజీని మట్టుపెట్టడమే ఈ సినిమాకి ముగింపు అనే సంగతి అందరికీ ముందే తెలిసిపోతుంది. అంటే క్లైమాక్స్ని ముందే ఊహించేస్తామన్నమాట. అయినా సరే.. ఆ ఉత్కంఠత ఎక్కడా సడలదు. అంత పకడ్బందీగా స్ర్కీన్ ప్లే రాసుకొన్నాడు దర్శకుడు.
అయితే కథ ప్రారంభం అంత సజావుగా సాగదు. నావీ భాష, సబ్మెరైన్లో చూపించిన టెక్నాలజీ అర్థం కావడం కోసం ఆడియన్స్ కష్టపడాల్సిందే. తెరపై ఏం జరుగుతుంది? అనే గందరగోళం నెలకొంటుంది. అయితే క్రమంగా కథ అర్థమవడం మొదలవుతుంది. లాజిక్కి అందని, సామాన్య ప్రేక్షకుడికి అర్థం కాని కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో కనిపిస్తాయి. కేవలం ప్రెజర్ పెట్టడం వల్ల.. బాంబు పేలిపోవడం, సముద్రంలో అట్టడుగున ఓ సబ్ మెరైన్లో సారే జహాసే అచ్ఛా.. పడితే మరో సబ్ మెరైన్లో ఉన్న వాళ్లకు వినిపించం.. ఇవన్నీ కాస్త విచిత్రంగా అనిపిస్తాయి. తాప్సి పాత్రని డిజైన్ చేసుకోవడం వెనుక ఉద్దేశం అర్థం కాదు. ఆమెకు రెండు మూడు డైలాగులిచ్చారు.
సబ్ మెరైన్లో సైనికులు గాయపడితే శరణార్థిగా వచ్చిన తాప్సి ట్రీట్మెంట్ చేస్తుంది. నిజానికి యుద్దానికి వెళ్తున్న సబ్ మెరైన్లో వైద్యులు ఉండరా? అనేది లాజిక్కులు వదిలేసిన పాయింట్. కేకే మీనన్ చనిపోయిన సీన్.. పైపై న తీసేశారు. నిజానికి ఆడియన్స్ అంతా కనెక్ట్ అయ్యే సీన్ అది. శత్రువులపై కథానాయకుడికే కాదు, థియేటర్లో ఉన్న ప్రేక్షకులకూ కసి పెరగాలి. అందుకు ఇలాంటి సీన్లు ఉపయోగపడతాయి. వాటిని లైట్ తీసుకోవడం బాలేదు. ఘాజీని కూల్చడం.. భారత సైనికుల లక్ష్యం. అసలు కథంతా దాని చుట్టూ తిరుగుతుంది. ఆ సన్నివేశాన్ని ఏ స్థాయిలో చూపించాలి? ఆ సీన్నీ ఒక్క షాట్తో తేల్చేశారు. ఇంకేదో జరగబోతోంది అని ఆశించిన ఆడియన్స్కి ఇది నిరాశ కలిగించే విషయమే.
* నటీనటులు - సాంకేతికత
టెక్నికల్గా గొప్ప స్టాండర్డ్స్లో ఉన్న సినిమా ఇది. విజువల్గా బాగుంది. కొన్ని షాట్స్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో కనిపిస్తాయి. సబ్ మెరైన్ సెట్ సూపర్. కే అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకొంటుంది. మది కెమెరాపనితనం హై స్టాండర్డ్స్ లో ఉంది. యుద్ధ నేపథ్యంలో సినిమా అన్నామని... భయంకరమైన యుద్ద సన్నివేశాలేం ఆశించకూడదు. దాని కంటే ఎమోషన్కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన సినిమా ఇది. దాన్ని పండించడంలో రానా, కేకే మీనన్, అతుల్ కులకర్ణి.. వీళ్లంతా తమ అత్యున్నత ప్రతిభ బయటకు తీసుకొచ్చారు. కేకే మీనన్ కి ఇచ్చిన డబ్బింగ్ సరిపోలేదు. లేదంటే.. అతని పాత్ర మరింత ఇంపాక్ట్ చూపించేది. ఇలాంటి కథ ని నమ్మినందుకు రానానీ, తీసినందుకు నిర్మాతల్నీ అభినందించాల్సిందే.
* చివరిగా: దేశభక్తి ఉప్పొంగించిన చిత్రం.. ఘాజీ
Rating : 3.25
Also Read