భారీ స్థాయిలో 'కార్తికేయ-2' బిజినెస్.. క్రేజ్ మాములుగా లేదు!
on Jun 30, 2022
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ'(2014) ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. యానిమల్ హిప్నటిజం కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో 'కార్తికేయ-2' వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే 'కార్తికేయ-2' ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. జూలై 22న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'కార్తికేయ' ప్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ మూవీ బిజినెస్ భారీగా జరిగిందట. థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ అన్ని రైట్స్ కలిపి రూ.34 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.
ఐదు భాషల్లో కలిపి 'కార్తికేయ-2' థియేట్రికల్ రైట్స్ రూ.18 కోట్లకు అమ్ముడవ్వగా.. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా మరో రూ.16 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. యంగ్ హీరో సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం విశేషమనే చెప్పాలి. మరి ఈ మిస్టరీ థ్రిల్లర్ అంచనాలకు తగ్గట్లు ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.