ENGLISH | TELUGU  

ఓజీ.. ఏంటీ గందరగోళం జీ..!

on Sep 20, 2025

 

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో మోస్ట్ హైప్డ్ మూవీ 'ఓజీ' అనడంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ఈ మూవీ.. సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇప్పటికే 'ఓజీ'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా తెలుగునాట సంచలన రికార్డులు నమోదు కావడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ప్రీమియర్ షోల టైమింగ్స్, టికెట్ రేట్ల విషయంలో.. తెలుగు రాష్ట్రాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. (They Call Him OG) 

 

పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కాబట్టి 'ఓజీ'కి టికెట్ రేట్స్ హైక్, షోల పెంపు పరంగా.. ఎటువంటి ఇబ్బంది లేకుండా.. అన్ని అనుమతులు లభిస్తాయని భావించారంతా. అందుకు తగ్గట్టుగానే అర్థరాత్రి ఒంటి గంట షోలకు.. వెయ్యి రూపాయల టికెట్ ప్రైస్ తో పర్మిషన్ వచ్చింది. అయితే ఇందులోనే ఒక మెలిక ఉంది. రోజుకి ఐదు షోలు కంటే ఎక్కువ వేయకూడదని పర్మిషన్ లెటర్ లో పేర్కొన్నారు. ఆ 'జీఓ'ని ఫాలో అయితే మాత్రం.. అర్థరాత్రి ఒంటి గంట షో తర్వాత.. విడుదల రోజు మరో నాలుగు షోలు మాత్రమే వేసుకోవాలి. ఇది ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది చాలదు అన్నట్టు.. తాజాగా తెలంగాణలో ముందురోజు ప్రీమియర్ షోలకి అనుమతి లభించడంతో.. కొత్త చిక్కు వచ్చి పడింది. (OG premieres)

 

తెలంగాణలో సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు 'ఓజీ' ప్రీమియర్ షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు ఒక్కో టికెట్ ధరని రూ.800గా నిర్ణయించారు. అంటే.. ఏపీ కంటే తెలంగాణలో నాలుగు గంటల ముందే షో పడుతుంది. పైగా టికెట్ ధర కూడా 200 తక్కువ. దీంతో పవన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం ఉండి కూడా.. తెలంగాణ కంటే నాలుగు గంటలు ఆలస్యంగా షో పడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రీమియర్ షో టికెట్ ధరలు కూడా సేమ్ ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటల షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు, షో కౌంట్ విషయంలో కూడా సవరణలు చేస్తూ.. కొత్త జీఓ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో.. ప్రీమియర్ షో టైమింగ్స్, టికెట్ రేట్లు ఒకేలా ఉండేలా నిర్మాతలు ముందే ప్లాన్ చేసుకుంటే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఎటువంటి అనుమతులు లభిస్తాయో క్లారిటీ తీసుకొని.. అందుకు తగ్గట్టుగా ఏపీలో ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అంటున్నారు.

 

ఇప్పటికే ఏపీలో ఒంటి గంట షోకి కొన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యి, ఫుల్ కూడా అయ్యాయి. కాబట్టి, రేట్ల విషయంలో సవరింపు చేయకపోయినా.. కనీసం సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటల షోలకైనా పర్మిషన్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. దీనిపై కొత్త జీఓ వచ్చే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాల్లో కూడా టాక్ నడుస్తోంది. రాకపోతే మాత్రం.. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నవారు.. 9 గంటల షో కోసం తెలంగాణకు క్యూ కట్టే అవకాశముంది. రెండొందలు తక్కువ రేటుకి, నాలుగు గంటలు ముందే షో చూసే ఛాన్స్ ఉండటంతో.. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలివెళ్లి తెలంగాణలో ప్రీమియర్ షోలు చూసే అవకాశముంది. మరి ఈ గందరగోళం లేకుండా.. ఫ్యాన్స్ ని కూల్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వం నుంచి కొత్త జీఓ వస్తుందేమో చూడాలి.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.