ENGLISH | TELUGU  

నిర్మాత నాగవంశీపై బాలయ్య అభిమానుల ఆగ్రహం.. అందుకే ఈవెంట్ కి హాజరు కాలేదా..?

on Jan 24, 2025

 

ఒక మంచి సినిమాని రూపొందించడం ఎంత ముఖ్యమో, దానిని భారీ ప్రమోషన్స్ తో ప్రజల్లోకి తీసుకెళ్ళడం అంత కంటే ముఖ్యం. కానీ కొందరు నిర్మాతలు తెలిసో తెలియకో ప్రమోషన్స్ విషయంలో అశ్రద్ధ చూపించి.. సినిమాకి రావాల్సినంత విజయాన్ని దక్కకుండా చేస్తారు. ఇటీవల విడుదలైన 'డాకు మహారాజ్' విషయంలో అదే జరిగింది. బ్లాక్ బస్టర్ కావాల్సిన సినిమాని, ఒక మామూలు హిట్ సినిమాకి పరిమితం చేశారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే రీసెంట్ గా జరిగిన 'డాకు మహారాజ్' సక్సెస్ మీట్ కి సైతం నిర్మాత నాగవంశీ డుమ్మా కొట్టారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. (Nandamuri Balakrishna)

 

'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ నటించిన సినిమా కావడంతో పాటు.. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో 'డాకు మహారాజ్'పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే, బాలయ్య సినిమా స్థాయి ప్రమోషన్స్ చేయనప్పటికీ.. 'డాకు మహారాజ్' ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ ని, ఓపెనింగ్స్ ని చూసి.. ఫుల్ రన్ లో రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. బాలకృష్ణ అభిమానులు కూడా.. ఈ సినిమా తమ హీరో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతుందని సంబరపడ్డారు. కానీ వారి సంతోషం ఎంతోకాలం నిలవలేదు. విడుదలకు ముందు ప్రమోషన్స్ ని మమా అనిపించిన మేకర్స్.. విడుదల తర్వాత పాజిటివ్ టాక్ వచ్చిన కూడా ప్రమోషన్స్ లో దూకుడు పెంచలేదు. (Naga Vamsi)

 

ఈ సంక్రాంతికి మూడు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలను దిల్ రాజు నిర్మించడంతో పాటు, నాగవంశీ నిర్మించిన 'డాకు మహారాజ్'కి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే 'డాకు మహారాజ్'కి అన్యాయం జరిగిందని బాలయ్య అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాను బాలకృష్ణ అభిమానిని అని నాగవంశీ పదే పదే చెబుతుంటారు. కానీ ఆ అభిమానానికి తగ్గట్టుగా 'డాకు మహారాజ్' ప్రమోషన్స్ లేవు. పైగా తెలంగాణలో టికెట్ ధరల పెంపుకి అవకాశం ఉన్నా కూడా.. కనీసం ప్రయత్నించలేదు. అయినప్పటికీ 'డాకు మహారాజ్' రికార్డ్స్ ఓపెనింగ్స్ సాధించి, సత్తా చాటింది. పోనీ ఆ తర్వాత అయినా ప్రమోషన్స్ లో దూకుడు పెంచి జనరల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారా అంటే.. అదీ లేదు. పైగా థియేటర్ల విషయంలోనూ తీవ్ర అన్యాయం జరిగింది. నిజానికి సంక్రాంతి సినిమాల్లో 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఈ రెండు సినిమాల థియేటర్ల కేటాయింపు విషయంలో వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది. 'డాకు మహారాజ్' మంచి వసూళ్లను రాబడుతున్న ఏరియాల్లోనూ ఆ థియేటర్లను 'సంక్రాంతికి వస్తున్నాం'కి కేటాయించారు. ఇలా 'డాకు మహారాజ్'కి అడుగడుగునా అన్యాయం జరిగింది. (Daaku Maharaaj)

 

రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాల్సిన సినిమాను రూ.150 కోట్ల గ్రాస్ క్లబ్ కి పరిమితం చేశారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంచి సినిమాని చంపేశావని, ఇంకెప్పుడు బాలయ్యతో సినిమా చేయొద్దని నాగవంశీపై కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు దర్శకుడు బాబీ సైతం నిర్మాత నాగవంశీ తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తన గత చిత్రం 'వాల్తేరు వీరయ్య'కు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, అదిరిపోయే ప్రమోషన్స్ చేసి దానిని రూ.200 కోట్ల క్లబ్ లో చేర్చారు ఆ చిత్ర నిర్మాతలు. కానీ ఇప్పుడు 'డాకు మహారాజ్' లాంటి మంచి సినిమా తీసి, దానికి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా.. సరైన ప్రమోషన్స్ లేక రూ.50 కోట్ల వసూళ్లను పోగొట్టుకుందనే అభిప్రాయం దర్శకుడు బాబీలో ఉందట. ఓ వైపు అభిమానుల ఆగ్రహం, మరోవైపు దర్శకుడు అసంతృప్తితో ఉండటంతోనే.. నిర్మాత నాగవంశీ ఇటీవల అనంతపురంలో జరిగిన సక్సెస్ మీట్ కి హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.