హైదరాబాద్ వచ్చిన మరో హీరోయిన్
on Aug 7, 2020
హీరోయిన్లు నెమ్మదిగా ముంబై నుండి హైదరాబాద్ వస్తున్నారు. కరోనాతో షూటింగులు బంద్ కావడంతో స్వస్థలాలకు, సినిమా రాజధాని ముంబైలో ఫ్లాట్స్కి వెళ్లిన ఒక్కొక్కరూ మళ్లీ భాగ్యనగరానికి తిరిగి వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం శృతి హాసన్ హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ ఆమెకు ఓ ఫ్లాట్ ఉంది. అందులో ఉంటున్నారు. అలాగే, మరో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సైతం కొన్ని రోజులు ముంబైలో, ఆ తరవాత ఢిల్లీలో తల్లితండ్రుల దగ్గర ఉన్నారు. తరవాత హైదరాబాద్ వచ్చారు. ఆమెకూ ఇక్కడ సొంత ఫ్లాట్ ఉంది. అందులో ఉంటున్నారు. ఇటీవల సీరత్ కపూర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె స్టార్ మా ఛానల్ కోసం ఓ ప్రోగ్రామ్ చేస్తున్నారు. లేటెస్టుగా 'హార్ట్ ఎటాక్' పోరి అదా శర్మ వచ్చారు.
ఇటీవల తెలుగులో అదా శర్మ ఓ సినిమా అంగీకరించారు. విప్రా దర్శకత్వం వహించనున్న ఆ సినిమాలో సంజయ్, భానుశ్రీ, హరితేజ తదితరులు ఇతర తారాగణం. ఆ సినిమా చిత్రీకరణకు అదా శర్మ హైదరాబాద్ వచ్చారు. చిత్రీకరణలు ప్రారంభం అవుతుండటంతో ఇండస్ట్రీ గాడిన పడుతుందని చోటామోటా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సంతోషపడుతున్నారు. మరిన్ని షూటింగులు స్టార్ట్ అయితే వాళ్లకు పని దొరుకుతుంది.