రాజకీయాల్లోకి వివాదాస్పద తమిళ్ హీరో?
on Sep 28, 2019
‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్ ‘వంద రాజా వాదాన్ వరువేన్’ రూ. 14 కోట్ల నష్టాన్ని మిగిల్చిందని చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అనౌన్స్ చేసింది. ఆ సినిమాలో హీరో శింబు. ఒకప్పుడు తెలుగులో ‘మన్మధ’, ‘వల్లభ’ వంటి సినిమాలో విజయాలు అందుకున్న ఈ హీరోకి ఇటువంటి వివాదాలు కొత్త కాదు. గతంలో చాలామంది నిర్మాతలు, దర్శకులు శింబుపై కంప్లయింట్స్ చేశారు. అతడు టైమ్కు షూటింగులకు రాని కారణంగా నిర్మాణ వ్యయం పెరిగి, సినిమాలకు నష్టాలు వస్తున్నాయని! కంప్లయింట్స్పై ఈ హీరో పెద్ద స్పందించినది లేదు. సినిమా వార్తలతో కంటే ప్రతి ఆర్నెల్లుకు ఏదో ఒక వివాదంతో శింబు వార్తల్లోకి వస్తుంటాడు.
జల్లికట్టు, కావేరీ నదీ జలాల సమస్యలో తమిళ ప్రజలకు మద్దతుగా శింబు సీన్లో హల్చల్ చేశాడు. రీసెంట్గా రాజకీయాల్లోకి ఈ వివాదాస్పద హీరో వస్తున్నాడనే వార్త చెన్నైలో చక్కర్లు కొడుతుంది. ప్రజెంట్ ఫారిన్లోనో ఉన్న శింబు చెన్నై రాగానే అభిమాన సంఘాల్లో కీలక వ్యక్తులను కలుస్తాడని, కొన్ని మార్పుల గురించి చర్చిస్తాడని శింబు మేనేజర్ ట్వీట్ చేశాడు. దాంతో శింబు రాజకీయాల్లోకి వస్తాడనే డిస్కషన్ మొదలైంది. దీంట్లో నిజం లేదని శింబు మేనేజర్ అంటున్నాడు. అదే సమయంలో అభిమానులు ప్రజలకు సేవ చేసేలా, వారి వెనుక ఉంటూ, వాళ్లను ముందుకు శింబు నడిపిస్తాడని చెబుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనతో శింబు అడుగులు వేస్తున్నాడని కోలీవుడ్ టాక్.