అసలు రాజేంద్రప్రసాద్ ఎలాంటోడు.. నిజాలు బయటపెట్టిన అశోక్ కుమార్!
on Jun 4, 2025
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల సినిమా వేదికలపై మాట్లాడుతున్న మాటలు వివాదాస్పదమవుతున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఆలీని ఒక బూతు మాట అనేశారు. రోజాని దాన్ని అన్నారు. ఇలా రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి. దీనిపై స్పందించిన రాజేంద్రప్రసాద్.. చనువు ఉన్నవారినే అలా సరదాగా అంటుంటానని చెప్పారు. ఆలీ కూడా రాజేంద్రప్రసాద్ కావాలని అనలేదని, ఈ విషయాన్ని పెద్దది చేసి చూడొద్దని కోరారు. తాజాగా ప్రముఖ నటుడు అశోక్ కుమార్ ఈ అంశంపై స్పందించారు.
రీసెంట్ గా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రాజేంద్రప్రసాద్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు అశోక్ కుమార్. "మా తరం నటీనటులంతా సరదాగా ఉంటాం. ఆ చనువుతో షూటింగ్ లొకేషన్స్ లో ఏరా అని మాట్లాడుకుంటాం. అయితే పదిమందిలో ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. కానీ ఒక్కోసారి మనకి తెలియకుండానే మాట్లాడేస్తుంటాం. బయట ఉన్న రిలేషన్, చనువుతో ఫ్లోలో ఏదోకటి అనేస్తుంటాం. వాటిని చూసీ చూడనట్టు వదిలేయాలి. ఆలీ కూడా స్టేట్ మెంట్ ఇచ్చాడు. వాళ్ళిద్దరి రిలేషన్ బాగున్నప్పుడు.. మిగతా వాళ్ళు దానిని పెద్దది చేసి చూడకూడదు. నన్ను రాజేంద్రప్రసాద్ బయట ఏరా అంటారు. ఆ చనువుతో ఒక ఈవెంట్ లో ఏరా నీ గుండు మీద ఒట్టు అన్నారు. దానిని నేను సరదాగా తీసుకున్నాను. కానీ, కొందరు మాత్రం అశోక్ కుమార్ మీద నోరు జారిన రాజేంద్రప్రసాద్ అని రాసేశారు. నాతో ఉన్న చనువు కొద్దీ ఫ్లోలో ఆయన అలా అనేశారు అంతే." అని అశోక్ కుమార్ చెప్పుకొచ్చారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
