'రాజుగాడు'కు టాటా చెప్పి... 'నేను లోకల్' చేశాడు!
on Jun 4, 2019
బుధవారం పెయిడ్ ప్రీమియర్ షోలతో విడుదలవుతున్న 'సెవన్'తో నిజార్ షఫీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తెలుగులో 'భలే భలే మగాడివోయ్'తో సినిమాటోగ్రాఫర్గా ప్రయాణం ప్రారంభించాడు నిజార్ షఫీ. తరవాత 'నేను లోకల్', 'మహానుభావుడు', 'శైలజారెడ్డి అల్లుడు' చేశాడు. అతడి కెమెరా వర్క్కి మంచి పేరుంది. అయితే... 'నేను లోకల్'కి ముందు ఒక సంఘటన జరిగింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'రాజుగాడు'కు నిజార్ షఫీ సినిమాటోగ్రాఫర్. ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే ఆ సినిమా కాస్త ఆలస్యమైంది. ఈలోపు 'నేను లోకల్' మొదలైంది. అందుకని, 'రాజుగాడు'కు పది రోజులు షూటింగ్ చూశాకా, ఆ సినిమాకు టాటా చెప్పేసి, 'నేను లోకల్' చేశాడు. ఇక, 'సెవెన్' విషయానికి వస్తే... ఇదొక ఇన్వెస్టిగేషన్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ అని నిజార్ షఫీ తెలిపాడు. ఇంకా అతడు మాట్లాడుతూ "నేను దర్శకుడిగా మారాలనుకున్నాను కానీ, ఇంత త్వరగా మెగాఫోన్ పడతానని అనుకోలేదు. మంచి కథ ఉందని హవీష్ ఫోన్ చేయడంతో విన్నాను. సినిమాటోగ్రఫీకి మంచి స్కోప్ ఉంది. అందుకని, ఓకే చెప్పేశా. రమేష్ వర్మ చెప్పిన కథను టీమ్ తో కలిసి డెవలప్ చేశాను. రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్ ప్రేమకథలో భాగమే. వాటిని ప్లాన్ చేసింది నేనే" అన్నారు. హవీష్ హీరోగా నటించిన ఈ సినిమాలో రెజీనా, త్రిదా చౌదరి, పూజితా పొన్నాడ, అనిషా అంబ్రోస్, అదితి ఆర్య, నందితా శ్వేత హీరోయిన్లు.