ట్రెండ్ సెట్టింగ్ మూవీ 'నువ్వే కావాలి'కి 21 ఏళ్ళు!
on Oct 13, 2021
తెలుగునాట ఆడ - మగ స్నేహం చుట్టూ అల్లుకున్న చిత్రాలు చెప్పుకోదగ్గ స్థాయిలో వచ్చినా.. ట్రెండ్ సెట్ చేసిన సినిమా మాత్రం ఒకటే. ఆ చిత్రమే.. `నువ్వే కావాలి`. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `నిరమ్` (కుంచకో బోబన్, షాలిని) ఆధారంగా రూపొందిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో తరుణ్, రిచా హీరోహీరోయిన్లుగా తొలి అడుగేశారు. కె. విజయ భాస్కర్ రూపొందించిన ఈ సినిమాని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కథాంశం విషయానికొస్తే.. జీవిత భాగస్వాములుగా మారే తరుణ్ (తరుణ్), మధు (రిచా) అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితుల కథే `నువ్వే కావాలి` చిత్రం. అశ్లీలత, అసభ్యతకు ఎలాంటి తావు లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా రూపొందిన ఈ చిత్రం.. చిన్న సినిమాగా విడుదలై పెద్ద చిత్రాలకు దీటుగా విజయం సాధించింది. 20 కేంద్రాలలో 200 రోజులు, 6 కేంద్రాల్లో 365 రోజులు ప్రదర్శితమై సంచలనం సృష్టించింది. అలాగే `ఉత్తమ ప్రాంతీయ చిత్రం` (తెలుగు)గా `జాతీయ` పురస్కారాన్ని .. `ఉత్తమ చిత్రం`, `ఉత్తమ నటి` (రిచా), `ఉత్తమ దర్శకుడు`, `ఉత్తమ నేపథ్య గాయకుడు` (శ్రీరామ్ ప్రభు - ``ఎక్కడ ఉన్నా``) విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డ్స్ ని సొంతం చేసుకుంది.
ఇక పాటల విషయానికొస్తే.. కోటి సంగీత సారథ్యంలో రూపొందిన గీతాలన్నీ బహుళ ప్రజాదరణ పొందాయి. ``ఎక్కడ ఉన్నా``, ``అనగనగా ఆకాశం``, ``కళ్ళల్లోకి కళ్ళుపెట్టి``, ``అమ్మమ్మలు తాతయ్యలు``, ``షుక్రియా షుక్రియా``, ``ఒలే ఒలే``.. ఇలా ఇందులోని ప్రతీ పాట యువతరాన్ని ఉర్రూతలూగించింది. 2000 అక్టోబర్ 13న విడుదలై మాతృకకి మించి విజయం సాధించడమే కాకుండా తెలుగునాట ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన `నువ్వే కావాలి`.. నేటితో 21 వసంతాలు పూర్తిచేసుకుంది.